గుడ్‌న్యూస్‌: ఓటీటీలోకి ఉప్పెన.. ఎప్పుడంటే

15 Feb, 2021 10:42 IST|Sakshi

మెగాస్టార్‌ మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయమైన ఉప్పెన సినిమాకు బాక్సాఫీస్‌ వద్ద వసూళ్ల వర్షం కురుస్తోంది. ఫిబ్రవరి 12 విడుదలైన ఈ చిత్రం థియేటర్లలో కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ సొంతం చేసుకొని సక్సెస్ టాక్‌తో ముందుకెళుతుంది. ఈ సినిమాలో వైష్ణవ్‌కు జోడీగా కృతి శెట్టి నటించగా.. తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి విలన్‌ పాత్రలో నటించాడు. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మించిన ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూర్చారు. తాజాగా ఉప్పెన సినిమా ఓటీటీలోకి ఎప్పుడు రాబోతుందనే విషయం తెరమీదకు వచ్చింది.

కరోనా భయంతో ఇంటికే పరిమితమైన ప్రజలు సినిమాలను ఓటీటీలో చూపేందుకు మొగ్గు చూపించారు. అందుకే ఓటీటీ సంస్థలు సైతం భారీ ధరలు పెట్టి సినిమాలను కొంటున్నాయి. క్రాక్, మాస్టర్ లాంటి సినిమాల విషయంలో ఇదే జరిగింది. ప్రస్తుతం ఉప్పెన సినిమాను ఓటీటీలో ఎప్పుడు విడుదల చేయబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. సినిమా రిలీజ్‌ అయిన సమయంలో రెండు మూడు వారాల్లోనే ఉప్పెన డిజిటల్‌లోకి వస్తుందనే వార్తలు వినిపించాయి. కానీ ప్రస్తుతం ఈ సినిమా 40 నుంచి 60 రోజుల టైమ్ గ్యాప్ పెట్టుకున్నట్లు తెలుస్తోంది. దీంతో మిగతా సినిమాలతో పోలీస్తే ఉప్పెన కాస్త ఆలస్యంగానే ఓటిటిలో అడుగుపెట్టనున్నట్లు సమాచారం.

అయితే ఈ సినిమా ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో మార్చి 26 నుంచి ప్రారంభం కానున్నదని ఒకవైపు టాక్ వినిపిస్తోంది. అదే విధంగా ఏప్రిల్‌ 11 నుంచి దర్శనం ఇవ్వనుందని మరోవైపు వినికిడి. ఈ రెండింటిలో ఏది వాస్తవమో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి ఉండాల్సిందే. ఇక విడుదలకు ముందే పాటలతో భారీ అంచనాలను ఏర్పరచుకున్న ఉప్పెన మూవీ డిజిటల్ హక్కుల కోసం అమెజాన్, ఆహా సంస్థలు కూడా పోటీ పడగా.. నెట్ ప్లిక్స్ భారీ ధరకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది.
చదవండి: ఉప్పెన’ ఫస్ట్‌ డే కలెక్షన్లు.. ఆల్‌టైమ్‌ రికార్డు
కూతురి గిఫ్ట్‌ను చూసి మురిసిపోతున్న మహేష్‌

మరిన్ని వార్తలు