Urvashi Rautela: ఆ హీరోయిన్‌కు రూ. 20 కోట్ల పారితోషికం !..

2 Aug, 2022 20:02 IST|Sakshi

Urvashi Rautela Charged Rs 20 Crores For The Legend Movie: సినీ ఇండస్ట్రీలో హీరోయిన్లకంటే హీరోలు అధిక పారితోషికం తీసుకోవడం సాధారణమే. హీరోలకు సరిసమానంగా రెమ్యునరేషన్‌ తీసుకునే ముద్దుగుమ్మలు మాత్రం చాలా అరుదు. అయితే స్టార్‌ హీరోయిన్ల కంటే ఎక్కువగా రెమ్యునరేషన్‌ను ఓ హీరోయిన్‌ తీసుకుందన్న వార్తలు ప్రస్తుతం హాట్‌ టాపిక్‌గా మారాయి. బాలీవుడ్ గ్లామర్ క్వీన్‌ ఊర్వశీ రౌటేలా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మోడల్‌గా రాణించిన ఈ ముద్దుగుమ్మ 2015 మిస్‌ యూనివర్స్ దివా కిరీటాన్ని సొంతం చేసుకుంది. తర్వాత సినిమాల్లోకి అడుగుపెట్టిన ఈ భామ బాలీవుడ్‌లో పాపులారిటీ సంపాదించుకుంది. 

ఊర్వశీ రౌటేలా తాజాగా 'ది లెజెండ్‌' సినిమాతో తమిళంలో తెరంగేట్రం చేసింది. ఈ సినిమాలో ప్రముఖ వ్యాపారవేత్త శరవణన్ అరుళ్‌ 51 ఏళ్ల వయసులో హీరోగా నటించాడు. న్యూ శరవణన్‌ స్టూడియోస్‌ ప్రొడక్షన్‌ పతాకంపై నిర్మించిన ఈ చిత్రానికి జేడి-జెయర్ ద్వయం దర్శకత్వం వహించారు. ప్రముఖ మ్యూజిక్‌ డైరెక్టర్ హరీశ్ జయరాజ్ సంగీతం అందించిన ఈ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్‌  ఇండియా మూవీగా జులై 28న విడుదలైంది. ఈ సినిమా విడుదలకు ముందే విపరీతమైన ట్రోలింగ్‌ జరిగిన విషయం తెలిసిందే.

అయితే ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించినందుకు ఊర్వశీ రౌటేలా రూ. 20 కోట్ల భారీ పారితోషికాన్ని అందుకుందని ఇటు కోలీవుడ్‌లో, అటు బాలీవుడ్‌లో వార్తలు గుప్పుమన్నాయి. ఇప్పటివరకు ఏ తమిళ హీరోయిన్‌కు అందని పారితోషికం ఊర్వశీకి తీసుకుందన్న విషయం హాట్‌ టాపిక్‌గా మారింది. ఈ విషయంపై సోషల్ మీడియాలో అనేక మీమ్స్‌ కూడా వచ్చాయి. దీంతో ఈ వార్తలను ఊర్వశీ రౌటేలా టీమ్‌ సన్నిహితం వర్గం ఖండించింది. ఈ వార్తలు అవాస్తవమని, ఊర్వశీ రూ. 20 కోట్ల రెమ్యునరేషన్‌ తీసుకోలేదని తెలిపింది. 

ఒకవేళ ఇదే నిజమైతే తమిళ ఇండస్ట్రీలో అత్యంత భారీ పారితోషికాన్ని అందుకున్న హీరోయిన్‌గా ఊర్వశీ రికార్డుకెక్కేది. కాగా సౌత్ లేడి సూపర్ స్టార్‌ నయనతార తన రాబోయే చిత్రాలకు రూ. 10 కోట్ల పారితోషికం అందుకుంటుందని సమాచారం.  

మరిన్ని వార్తలు