Ranga Ranga Vaibhavanga: ఆ సినిమా రీమేక్‌లో నటించాలని ఉంది

2 Sep, 2022 00:26 IST|Sakshi

– వైష్ణవ్‌ తేజ్‌  

‘‘రంగ రంగ వైభవంగా’లో ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు అందమైన ప్రేమకథ, భావోద్వేగాలు, ఫ్యామిలీ డ్రామా.. ఇలా అన్నీ ఉన్నాయి.  ఈ చిత్రాన్ని ప్రేక్షకులు బాగా ఎంజాయ్‌ చేస్తారు’’ అన్నారు వైష్ణవ్‌ తేజ్‌. గిరీశాయ దర్శకత్వంలో వైష్ణవ్‌ తేజ్, కేతికా శర్మ జంటగా నటించిన చిత్రం ‘రంగ రంగ వైభవంగా’. బాపినీడు .బి సమర్పణలో బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా వైష్ణవ్‌ తేజ్‌ పంచుకున్న విశేషాలు.

► నా సినిమా కథల ఎంపికలో ఓ ప్రేక్షకునిగా ఆలోచిస్తాను. ఈ విషయంలో సాయిధరమ్‌ తేజ్‌ (వైష్ణవ్‌ అన్న) తో పాటు ఎవరి సపోర్ట్‌ తీసుకోను. నేనే ఎంచుకుంటున్నాను. గిరీశాయ కథ చెప్పిన విధానం, కథపై ఆయనకు ఉన్న నమ్మకం నచ్చింది. పైగా ఆయన మంచి అనుభవం ఉన్న దర్శకుడు. అందుకే ‘రంగ రంగ వైభవంగా’ చేశా.

► ఈ సినిమాలో చాలామంది సీనియర్‌ నటీనటులున్నారు. సీనియర్స్‌తో నటించడం వల్ల వారి అనుభవం, అంకితభావం వంటి విషయాలు తెలుసుకున్నాను. నటన విషయంలో మెగా ఫ్యామిలీలోని అందరి నుంచి స్ఫూర్తి పొందుతుంటాను.

► బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌గారి లాంటి సీనియర్‌ నిర్మాత బేనర్‌లో సినిమా చేయడం సంతోషంగా ఉంది. ఆయనే మంచి టీమ్‌ని సెట్‌ చేశారు. దేవిశ్రీ ప్రసాద్‌గారు అద్భుతమైన సంగీతం ఇచ్చారు. శ్యామ్‌దత్‌గారు మంచి విజువల్స్‌ ఇచ్చారు.

► ‘ఉప్పెన’తో నాకు పెద్ద హిట్‌ వచ్చింది. ఆ తర్వాత చేసిన ‘కొండపొలం’ మేము అనుకున్నంతగా ఆడలేదు.. అందుకు ఎలాంటి బాధ లేదు. నా ప్రతి సినిమా రొటీన్‌గా కాకుండా వైవిధ్యంగా ఉండాలనుకుంటాను. పెదనాన్న (చిరంజీవి), బాబాయ్‌ (పవన్‌ కల్యాణ్‌) సినిమాలను నేను రీమేక్‌ చేయడమంటే సాహసమే. మంచి కథ కుదిరి, డైరెక్టర్‌ నన్ను కన్విన్స్‌ చేయగలిగితే ‘బద్రి’ సినిమా రీమేక్‌లో నటించాలనుంది. ప్రస్తుతం సితార బ్యానర్‌లో కొత్త డైరెక్టర్‌ శ్రీకాంత్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాను.  

మరిన్ని వార్తలు