Vakeel Saab: వకీల్‌సాబ్‌ నిర్మాతలకు నోటీసులు

3 May, 2021 12:44 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ నటించిన 'వకీల్‌ సాబ్‌' సినిమా మీద అభ్యంతరం తెలుపుతూ ఓ వ్యక్తి పోలీస్‌ స్టేషన్‌ను ఆశ్రయించాడు. ఈ సినిమాలోని ఓ సన్నివేశంలో తన ఫోన్‌ నంబర్‌ను వాడుకున్నారంటూ సుధాకర్‌ అనే వ్యక్తి పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. తన అనుమతి లేకుండానే వకీల్‌ సాబ్‌లో ఓ చోట తన ఫోన్‌ నంబర్‌ను స్క్రీన్‌ మీద చూపించారని ఆగ్రహం వ్యక్తం చేశాడు.

దీనివల్ల ఎంతో మంది తరచూ ఫోన్లు చేస్తూ తనకు ఇబ్బంది కలిగిస్తున్నారని తెలిపాడు. కొందరైతే నోటికొచ్చినట్లు తిడుతున్నారని వాపోయాడు. ఇప్పటికే ఈ విషయంపై బాధితుడి తరపు లాయర్‌ వకీల్‌ సాబ్‌ నిర్మాతలకు లీగల్‌ నోటీసులు పంపాడు. దీనిపై వారు స్పందించాల్సి ఉంది.

కాగా 'అజ్ఞాతవాసి' ఫెయిల్యూర్‌ తర్వాత మూడేళ్ల గ్యాప్‌ తీసుకుని వకీల్‌సాబ్‌తో రీఎంట్రీ ఇచ్చాడు పవన్‌ కల్యాణ్‌. అమితాబ్‌ బచ్చన్‌ ప్రధాన పాత్రలో నటించిన 'పింక్‌'కు రీమేక్‌గా తెరకెక్కిందీ చిత్రం. ఏప్రిల్‌ 9న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్‌ ప్రైమ్‌లో ప్రసారమవుతోంది.

చదవండి: ప్రభాస్‌ అలా ఉంటాడని ఊహించలేదు : శృతీహాసన్‌

మరిన్ని వార్తలు