Valimai Movie: అజిత్‌ 'వలిమై' సినిమా థియేటర్‌పై బాంబుతో దాడి!

24 Feb, 2022 11:16 IST|Sakshi

కోయంబత్తూరు (తమిళనాడు): కోలీవుడ్‌ స్టార్‌ అజిత్‌ హీరోగా, టాలీవుడ్‌ హీరో కార్తికేయ విలన్‌గా నటించిన తాజా చిత్రం వలిమై. హెచ్‌ వినోద్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా గురువారం(ఫిబ్రవరి 24న) థియేటర్లలో రిలీజైంది. అజిత్‌ సినిమా ఫస్ట్‌ డే చూసేందుకు థియేటర్‌కు తరలివచ్చిన అభిమానులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటుండగా ఈ వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. కోయంబత్తూరులోని గంగవల్లి మల్టీప్లెక్స్‌ థియేటర్‌ ముందు పెట్రోల్‌ బాంబ్‌ దాడి జరిగింది. బైక్‌పై వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు వలిమై సినిమా నడుస్తున్న థియేటర్‌ ఎదుట బాంబుతో దాడి చేశారు.

అక్కడే ఉన్న అభిమానులు వారిని పట్టుకునేందుకు ప్రయత్నించగా వారు బైక్‌పై పరారయ్యారు. ఈ దాడిలో ఎవరూ గాయపడలేదు. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దుండగులను పట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఇదిలా ఉంటే తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో రిలీజైన వలిమైకి పాజిటివ్‌ రెస్పాన్స్‌ వస్తోంది. అజిత్‌, కార్తికేయల నటనకు మంచి ప్రశంసలు దక్కుతున్నాయి.

మరిన్ని వార్తలు