Vani Bhojan: అతనితో సహజీవనం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్‌

10 Nov, 2022 08:52 IST|Sakshi

టీవీ యాంకర్‌ నుంచి వెండితెర కథానాయిక వరకు ఎదిగిన నటి వాణిభోజన్‌. మధ్యలో టీవీ సీరియల్‌లో నటించి బుల్లితెర నయనతారగా పేరు తెచ్చుకున్న ఈమె అధికారం 97 చిత్రం ద్వారా కథానాయకిగా ఎంట్రీ ఇచ్చింది. ఓ మై కడవలే చిత్రంతో ఆమెకు మంచి గుర్తింపు లభించింది. ఆ తరువాత లాకప్, రామే ఆండాలుమ్‌ రావణనే ఆండాలుమ్‌ తదితర చిత్రాల్లో నటించి గుర్తింపు పొందింది. కాగా మహాన్‌ చిత్రంలో విక్రమ్‌కు జంటగా నటించింది.

ప్రస్తుతం 10 చిత్రాలకు పైగా చేస్తూ బిజీగా ఉన్న వాణిభోజన్‌ ఇటీవల హీరో జయ్‌తో సహజీవనం చేస్తున్నట్లు, ఆమె నటించే చిత్రాల కథలను కూడా ఆయనే విని ఎంపిక చేస్తున్నట్లు, దర్శక నిర్మాతలు వాణిభోజన్‌ను కలిసి కథల చెప్పే అవకాశం కూడా లేకపోతున్నట్లు వార్తలు జోరందుకున్నాయి. కాగా ఇలాంటి ప్రచారంపై ఈమె కాస్త ఆలస్యంగా స్పందించింది. అలాంటి వార్తలు తన వరకు వచ్చాయని, అయితే అవన్నీ వదంతులేనని కొట్టి పారేసింది.

వాణిభోజన్‌ నటుడు భరత్‌కు జంటగా నటించిన మిరల్‌ చిత్ర నిర్మాణం పూర్తి చేసుకుని, ఈ నెల 11వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్ర ప్రమోషన్‌లో భాగంగా ఈమె ఒక భేటీలో పేర్కొంటూ తాను డబ్బు కోసమో లేక దర్శక నిర్మాతల కోసమో చిత్రాల్లో నటించడం లేదని చెప్పింది. అలాగే కథలను తానే విని నచ్చిన వాటినే ఎంపిక చేసుకుని నటిస్తున్నట్లు తెలిపింది. మిరల్‌ లాంటి హర్రర్‌ థ్రిల్లర్‌ కథా చిత్రాల్లో నటించడానికి కారణం ఏమిటన్న ప్రశ్నకు బదులిస్తూ ఈ విషయంలో ఎలాంటి ప్లాను లేదని చెప్పింది. కథ, తన పాత్ర ఇంప్రెస్‌ చేసిందని అందుకే అంగీకరించినట్లు తెలిపింది. అంతేకాని తొందరపడి చిత్రాలను ఒప్పుకోవడం లేదని స్పష్టం చేసింది. అయితే హిందీ చిత్రం గంగుభాయ్‌ వంటి కథా చిత్రాలలో నటించాలని కోరుకుంటున్నట్లు నటి వాణిభోజన్‌ పేర్కొంది.

మరిన్ని వార్తలు