Varalaxmi Sarathkumar: ప్లీజ్‌.. అలాంటివేవైనా ఉంటే చెప్పండి: వరలక్ష్మి శరత్‌కుమార్‌

11 Sep, 2022 09:25 IST|Sakshi

ఎలాంటి పాత్రనైనా నటించి మెప్పించే సత్తా ఉన్న నటి వరలక్ష్మి శరత్‌కుమార్‌. ప్రముఖ నటుడు శరత్‌కుమార్‌ వారసురాలైన ఆమె శరత్‌కుమార్‌ బ్రాండ్‌ను పెద్దగా ఉపయోగించుకోకుండానే నటిగా సినీ రంగ ప్రవేశం చేశారు. 2012లో శింబుకు జంటగా పోడాపోడి చిత్రంతో కథానాయికగా ఎంట్రీ ఇచ్చిన ఈమె నటిగా దశాబ్దాన్ని పూర్తి చేసుకున్నారు.

తొలి చిత్రంతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న వరలక్ష్మి శరత్‌కుమార్‌ ఆ తరువాత బాలా దర్శకత్వంలో తారై తప్పట్టై, పుష్కర్, గాయత్రిల దర్శకత్వంలో విక్రమ్‌ వేదా హిట్‌ చిత్రాలలో కథానాయికగా నటించారు. ఆ తరువాత లింగుస్వామి దర్శకత్వంలో విశాల్‌ హీరోగా నటించిన సండైక్కోళి–2 చిత్రంతో ప్రతినాయకిగా అవతారమెత్తారు. అదే విధంగా విజయ్‌ కథానాయకుడుగా నటించిన సర్కార్‌ చిత్రంలో మరోసారి విలనిజాన్ని ప్రదర్శించారు.

చదవండి: (Krishnam Raju: రాజకీయాల్లోనూ కీలక పాత్ర పోషించిన రెబల్‌స్టార్‌)

ఆపై నాయకి, ప్రతినాయకి అన్న భేదం లేకుండా వైవిధ్యం అనిపించిన పాత్రలకు ఓకే చెప్పేసుకుని నటిస్తూ ఆల్‌రౌండర్‌గా మారిపోయారు. అదే విధంగా ఒక్క తమిళ భాషలోనే కాకుండా తెలుగు, కన్నడం అంటూ దక్షిణాది భాషల్లోనూ నటిస్తూ బహుభాషా నటిగా పేరు తెచ్చుకున్నారు. అన్నట్టు వరలక్ష్మి శరత్‌కుమార్‌ మంచి డాన్సర్‌ కూడా. బెల్లీ డాన్స్‌ సూపర్‌గా చేస్తారు. ప్రస్తుతం పాంబన్, గ్రంథాలు పిరందాళ్‌ పరాశక్తి, కలర్స్, యశోద, శబరితో పాటు తెలుగులో బాలకృష్ణ చిత్రంలోనూ నటిస్తున్నారు.

కాగా ఈమె ఇటీవల ఒక భేటీలో పేర్కొంటూ తనకు హాస్యభరిత కథా చిత్రంలో నటించాలన్నది చిరకాల కోరిక అన్నారు. అయితే తనకు అలాంటి పాత్రలో నటించే అవకాశాలు రావడం లేదని, అన్ని ప్రతినాయకి పాత్రలే వస్తున్నాయన్నారు. కాబట్టి ఎవరైనా కామెడీ కథా చిత్రాల్లో నటించే అవకాశం చెప్పండి ప్లీజ్‌ అని నటి వరలక్ష్మి శరత్‌కుమార్‌ అంటున్నారు.   

చదవండి: (దర్శకుడు భారతీరాజా ఇంటికి సీఎం స్టాలిన్‌)

మరిన్ని వార్తలు