Veera Simha Reddy: పూనకం వచ్చినట్లుగా పూజారి మాస్‌ డ్యాన్స్‌.. వీడియో వైరల్‌

12 Jan, 2023 15:12 IST|Sakshi

నందమూరి బాలకృష్ణ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన రోజు రానే వచ్చింది. నేడు(జనవరి 12) బాలయ్య మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ వీరసింహారెడ్డి సినిమా రిలీజైంది. గోపీచంద్‌ మలినేని డైరెక్ట్‌ చేసిన ఈ మూవీని మైత్రీమూవీ మేకర్స్‌ బ్యానర్‌పై నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌ నిర్మించారు. తమన్‌ సంగీతం అందించాడు. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా చూసి ఫ్యాన్స్‌ రెచ్చిపోతున్నారు. ఏడాది తర్వాత బాలయ్య స్క్రీన్‌పై కనిపించడంతో ఆనందం పట్టలేక థియేటర్ల ముందు రచ్చరచ్చ చేస్తున్నారు.

ఇక సినిమాలో పాటలు వచ్చినప్పుడు అభిమానులు చేసే హంగామా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. జై బాలయ్య, మా బావ మనోభావాలు దెబ్బ తిన్నాయే వంటి సాంగ్స్‌ వచ్చినప్పుడు ప్రేక్షకులు సీట్లలో నుంచి లేచి పేపర్లు విసురుతూ స్టెప్పులేస్తూ తెగ సందడి చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి. అందులో ఓ వీడియో అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. థియేటర్‌లో సినిమా చూడటానికి వచ్చిన ఓ పూజారి జై బాలయ్య పాట రాగానే పూనకం వచ్చినట్లుగా స్టెప్పులేశాడు. అతడిని చూసి అక్కడున్నవారంతా ఎంకరేజ్‌ చేశారు. మొత్తానికి తమన్‌ తన మ్యూజిక్‌తో ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించాడు. మరోపక్క బాలయ్య భ్రమరాంబ థియేటర్‌లో సినిమా ఆస్వాదించిన వీడియో సైతం చక్కర్లు కొడుతోంది. 

చదవండి: వీరసింహారెడ్డి సినిమా రివ్యూ
నాపై అభిమాని విషప్రయోగం చేశాడు: చిరంజీవి

మరిన్ని వార్తలు