Drushyam 2 Movie: 'ఇలాంటి సినిమా చేయడం నా అదృష్టం'

16 Nov, 2021 08:00 IST|Sakshi

‘‘నేనెప్పుడు కొత్త తరహా సినిమాలు చేసినా ప్రేక్షకులు ఆదరిస్తూనే ఉన్నారు.. ‘దృశ్యం 2’ని కూడా ఆదరిస్తారు.. ఎంజాయ్‌ చేస్తారు’’ అన్నారు వెంక టేశ్‌. జీతూ జోసెఫ్‌ దర్శకత్వంలో వెంకటేశ్, మీనా జంటగా నటించిన చిత్రం ‘దృశ్యం 2’. ఆంటోని పెరంబవూర్, రాజ్‌కుమార్‌ సేతుపతి, సురేశ్‌బాబు నిర్మించిన ఈ చిత్రం అమెజాన్‌ ప్రైమ్‌లో ఈ నెల 25నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. ఈ సందర్భంగా ‘దృశ్యం 2’ ట్రైలర్‌ను విడుదల చేశారు.

అనంతరం వెంకటేశ్‌ మాట్లాడుతూ– ‘‘దృశ్యం’ తర్వాత మళ్లీ అలాంటి సినిమా చేయాలని ఎప్పుడూ అనుకునేవాణ్ణి.. ‘దృశ్యం 2’ అనే అద్భుతమైన కథతో వచ్చిన జీతూ జోసెఫ్‌కి థ్యాంక్స్‌. ఇటీవల అలాంటి కథని ఎవరూ తీయలేదు. ఇలాంటి సినిమా చేయడం నా అదృష్టం. మలయాళంలో బ్లాక్‌బస్టర్‌ అయిన ‘దృశ్యం 2’ ని తెలుగులో చేయడం ఓ సవాల్‌.  ఈ సినిమా ఫైనల్‌ ఔట్‌పుట్‌ చూశాక చాలా సంతోషంగా ఉన్నాను. తెలుగు చిత్రాల్లో ఇదొక బెస్ట్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌’’ అన్నారు.

జీతూ జోసెఫ్‌ మాట్లాడుతూ– ‘‘దృశ్యం 2’ గురించి రాజమౌళి సార్‌ నాకు మెసేజ్‌ చేసినప్పుడు హైదరాబాద్‌లో నా ఫ్యామిలీతో కలిసి ఉన్నాను. ఆయన మెసేజ్‌ చేశారంటే ముందు నమ్మలేదు.. పూర్తి మెసేజ్‌ చదివాక.. ఇండస్ట్రీలో గ్రేటెస్ట్‌ డైరెక్టర్‌ అయిన ఆయన మెసేజ్‌ చేయడంతో అందరం చాలా సంతోషపడ్డాం’’ అన్నారు. మీనా మాట్లాడుతూ– ‘‘వెంకటేశ్‌గారితో చాలా సినిమాలు చేశాను కాబట్టి కంఫర్ట్‌ లెవల్‌ ఎక్కువగా ఉంటుంది. మేం కో స్టార్స్‌ మాత్రమే కాదు.. మంచి ఫ్రెండ్స్‌’’ అన్నారు.

‘‘రాంబాబు పాత్రకి వెంకటేశ్‌ తప్ప ఎవరూ సరిపోరు. ఆయన ఫ్యామిలీ మ్యాన్‌ కాబట్టి ఆ పాత్రలో జీవించారు’’ అన్నారు ‘దృశ్యం’ డైరెక్టర్‌ శ్రీప్రియ. రాజ్‌కుమార్‌ సేతుపతి, నటులు ‘సీనియర్‌’ నరేశ్, సంపత్, సంగీత దర్శకుడు అనూప్‌ రూబెన్స్, పాటల రచయిత చంద్రబోస్, మాటల రచయిత రమేశ్, నటి ఈస్తర్‌ అనిల్‌ పాల్గొన్నారు.


 

మరిన్ని వార్తలు