Jaitra Teaser: జోడెద్దులు, నాలుగెకరాల పొలం ఉన్న భాగ్యవంతుడి కథే ‘జైత్ర’

26 May, 2022 10:15 IST|Sakshi
సన్నీ, రోహిణి, వెంకీ కుడుముల, మల్లికార్జున్‌

‘‘ఇంజనీరో, డాక్టరో అవుతామని పిల్లలు చెప్పిన మాటలను వారి తల్లిదండ్రులు నమ్ముతారు. అలాగే యాక్టరో, ఫిల్మ్‌ మేకరో అవుతామని చెప్పినా కూడా తల్లిదండ్రులు నమ్మాలని కోరుకుంటున్నాను. ఫిల్మ్‌ మేకింగ్‌ కూడా బాధ్యతతో, గౌరవంతో కూడిన ఉద్యోగం’’ అన్నారు దర్శకుడు వెంకీ కుడుముల. సన్నీ నవీన్, రోహిణీ రేచల్‌ జంటగా నటించిన చిత్రం ‘జైత్ర’. అల్లం సుభాష్‌, సురేశ్‌ కొండేటి నిర్మించిన ఈ సినిమా టైటిల్‌ లోగో, ఫస్ట్‌ లుక్, టీజర్‌ లాంచ్‌ కార్యక్రమం బుధవారం జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అథితిగా హాజరైన వెంకీ కుడుముల మాట్లాడుతూ – ‘‘నా ‘ఛలో’ సినిమాకు అసిస్టెంట్‌ దర్శకుడిగా చేసిన మల్లి సినిమాకు నేను అతిథిగా రావడం హ్యాపీగా ఉంది. మల్లి చాలా నిజాయితీగా ఈ సినిమా తీసి ఉంటాడని ఆశిస్తున్నాను’’ అన్నారు. ‘‘రాయలసీమలో జోడెద్దులు, నాలుగెకరాల పొలం ఉన్న భాగ్యవంతుడి కథే ‘జైత్ర’’ అన్నారు మల్లికార్జున్‌. ‘‘ప్రేమిస్తే, జర్నీ, పిజ్జా... ఇలా 15 సినిమాలను రిలీజ్‌ చేశాను. నిర్మాతగా నాకు మంచి పేరు తీసుకువచ్చే మరో సినిమా ‘జైత్ర’ సుభాష్‌ గారి ద్వారా వస్తున్నందుకు సంతోషంగా ఉంది’’ అన్నారు సురేష్‌ కొండేటి. ‘‘రాయలసీమ యాసతో కూడిన మట్టిమనుషుల కథే ఈ చిత్రం’’ అన్నారు సుభాష్‌.   

మరిన్ని వార్తలు