విధు వినోద్‌ చోప్రా సినీ అనుభవాలతో ‘అన్‌స్క్రిప్టెడ్‌’

13 Jan, 2021 09:22 IST|Sakshi

‘నేను చనిపోయాక ఒకనాడెప్పుడో ఎవరో పాఠకుడు ఈ పుస్తకం చదివి కశ్మీర్‌లోని చిన్న గూడెం నుంచి వొచ్చిన ఈ మనిషి ముంబైకి చేరుకుని తన కలలన్నీ నెరవేర్చుకున్నాడు. తన ఆత్మను అమ్మకానికి పెట్టకుండానే ఈ విజయం సాధించాడు. నేనెందుకు నా ఆత్మను పణంగా పెట్టి రాజీ పడి నాక్కావలసింది పొందాలి అనుకుంటే నాకు అంతేచాలు’ అన్నారు దర్శకుడు విధు వినోద్‌ చోప్రా. ఆయన రచయిత అభిజిత్‌ జోషితో కలిసి తన సినిమా అనుభవాలను ‘అన్‌స్క్రిప్టెడ్‌’ పేరుతో పుస్తకంగా వెలువరించనున్నాడు. ప్రసిద్ధ పబ్లిషింగ్‌ సంస్థ ‘పెంగ్విన్‌’ దీనిని ప్రచురించనుంది. ఈ పుస్తకాన్ని రాస్తున్న అభిజిత్‌ జోషి ‘ఒకసారి నన్ను ఏదో కోట్‌ (quote) రాయమని వినోద్‌ చోప్రా అడిగారు. నేను రాసిచ్చాను. ఆయన ఒక కొత్త చొక్కా నాకు అందిస్తూ ‘కోట్‌ (quote) బదులుగా చొక్కా’ అంటూ ఇచ్చారు. ఆయన ఏది మాట్లాడినా ఒక విశేషం ఉంటుంది. ఆయన జీవితం నిండా విశేషాలే. నటుడుగా మొదలెట్టి దర్శకుడిగా నిర్మాతగా మారారు. రూపాయి లేకుండా ముంబై వచ్చి కోట్ల కలెక్షన్లు రాబట్టిన సినిమాలు తీశారు. ఆ సినిమాల వెనుక ఉన్న విశేషాలు ఈ పుస్తకం నిండా ఉంటాయి’ అన్నారు. చదవండి: పాఠకుల మనసులూ దోచుకున్నాడు! 

విధు వినోద్‌ చోప్రా ‘జానే భీ దో యారో’ సినిమాలో నటించారు. ‘పరిందా’ సినిమాకు దర్శకత్వం వహించి గొప్ప పేరు సంపాదించారు. ‘1942 ఏ లవ్‌ స్టోరీ’ తీశారు. ఆ తర్వాత రాజ్‌కుమార్‌ హిరాణిని దర్శకుడిగా పరిచయం చేసి ‘మున్నాభాయ్‌ ఎంబిబిఎస్‌’, ‘లగే రహో మున్నాభాయ్‌’, ‘3 ఇడియెట్స్‌’ సినిమాలు తీశారు. విధు వినోద్‌ చోప్రా కశ్మీర్‌ సమస్యను పండిట్‌ల దృష్టి కోణం నుంచి చెప్పే సినిమాలు తీశారు. వాటిలో ఇటీవల వచ్చిన ‘షికారా’ ముఖ్యమైనది.  

మరిన్ని వార్తలు