అప్పుడు చాలా ఇబ్బంది పడ్డాను

1 Jan, 2021 13:27 IST|Sakshi

ముంబై: బాలీవుడ్‌ నటి విద్యాబాలన్‌ నేడు 42వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. శుక్రవారం(జనవరి 1) ఆమె పుట్టిన రోజు సందర్భంగా బాలీవుడ్‌ నటీనటులు,‌ ప్రముఖులు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కొత్త సంవత్సరం రోజునే ఆమె పుట్టిన రోజును జరుపుకోవడం విశేషం. 2005లో వచ్చిన ‘పరిణీత’ సినిమాతో విద్యాబాలన్‌ బాలీవుడ్‌ వెండితెరపై కనిపించారు. దానికంటే ముందు విద్యాబాలన్‌ బుల్లితెరపై ‘హమ్‌ పాంచ్‌’‌ సిరీయల్‌లో నటించిన సంగతి తెలిసిందే. ఈ సీరియల్‌ ప్రారంభమైన ఏడాది తర్వాత విద్యాబాలన్‌ అందులో నటించినట్లు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె స్వయంగా చెప్పుకొచ్చారు. ‘నేను హమ్‌ పాంచ్‌‌ ప్రారంభమైన ఏడాది తర్వాత సీరియల్‌లో నటించాను. వాస్తవానికి ఇందులో మొదట నటి అమితా నంగియా లీడ్‌రోల్‌ రాధిక మాథూర్‌ పాత్ర పోషించారు. ఈ సీరియల్‌కు మా అమ్మ పెద్ద అభిమాని. అయితే ఏడాది తర్వాత నంగియా స్థానంలో నటించాలని సీరియల్‌ నిర్మాత ఏక్తా కపూర్‌ నన్ను సంప్రదించడంతో ఇందులో నటించే అవకాశం వచ్చింది.

కానీ అప్పటికే ఈ సీరియల్‌‌ పెద్ద హిట్‌ అయ్యింది. అయినప్పటికీ హమ్‌ పాంచ్‌‌ అభిమానులు, మిగతా తారగణం అంతా నన్ను స్వాగతించారు. నేను రెండు యాడ్‌ ఫిల్మ్స్‌‌ చేస్తున్న సమయంలో మా అమ్మ హమ్‌ పాంచ్‌లో రాధిక వంటి క్యారెక్టర్‌లో నన్ను చూడాలని ఎప్పడూ అంటుండేది. కొన్ని రోజులకు హామ్‌ పాంచ్‌లో రాధిక మాథుర్‌ పాత్ర చేయాలనుకుంటున్నారా అని ఏక్తా నాకు ఫోన్‌ చేసి అడగడంతో ఒక్కసారిగా షాక్‌ అయ్యాను. ఇక నా ఆనందానికి హద్దులు లేవు. ఒక్కసారిగా ఎగిరి గంతేయాలన్న సంతోషం వచ్చింది. కానీ ఏక్తాతో కాల్‌ మాట్లాడుతున్నందున వినయంగా ఆమెకు తప్పకుండా అని సమాధానం ఇచ్చాను’ అని చెప్పారు. ఈ సీరియల్‌లో నటించిన భైరవి, షోమా, వందనాలు నా వయస్సు వారే అయినప్పటికి నటనలో వారికి నాకంటే చాలా అనుభవం ఉంది. దీంతో వారితో ఉన్న చేసే సన్నివేశాల్లో నటించేటప్పుడు చాలా ఇబ్బంది పడ్డాను. కాగా విద్యాతో పాటు ‘హమ్ పాంచ్’‌లో షోమా ఆనంద్, భైరవి రైచురియా, వందన పథక్, అశోక్ సారాఫ్ కూడా నటించారు నటించారు. ఈ సీరియల్‌ 1995 నుంచి 2006 వరకు ప్రసారం అయ్యింది.

మరిన్ని వార్తలు