Vijay Devarakonda: మాట మీద నిలబడ్డ రౌడీ హీరో.. వంద కుటుంబాలకు చెక్కులు..

14 Sep, 2023 13:25 IST|Sakshi

ఎంతో కొంత తిరిగిచ్చేయాలి, లేదంటే లావైపోతాం.. ఇది సినిమా డైలాగ్‌. కానీ విజయ్‌ దేవరకొండ నిజ జీవితంలోనూ ఈ డైలాగ్‌ పాటిస్తున్నట్లే కనిపిస్తాడు. తను సక్సెస్‌ను అందుకున్నప్పుడు, సంతోషంగా ఉన్నప్పుడు దాన్ని అభిమానులతో పంచుకుంటాడు. ఈ క్రమంలో ఖుషి సక్సెస్‌ను ఫ్యాన్స్‌తో షేర్‌ చేసుకోవాలనుకున్నాడు రౌడీ హీరో. అందులో భాగంగా వంద కుటుంబాలకు లక్ష చొప్పున కోటి రూపాయలు ఇస్తానని ఖుషి వైజాగ్ సక్సెస్ సెలబ్రేషన్స్ ఈవెంట్‌లో ప్రకటించాడు. అందుకోసం దరఖాస్తులకు ఆహ్వానించాడు. బోలెడంతమంది దీనికి అప్లై చేసుకోగా తాజాగా వంద లక్కీ కుటుంబాలను అనౌన్స్‌ చేశారు.

గురువారం నాడు 100 మంది లక్కీ ఫ్యామిలీస్‌ను ఎంపికచేసి ఆ లిస్టును రిలీజ్ చేశాడు విజయ్. 'ఖుషి హ్యాపీనెస్ షేర్ చేసుకునేందుకు ఈ వంద మంది ఫ్యామిలీస్‌ను ఎంపిక చేశాం. ఈ లిస్టులో పేరున్న కుటుంబాలు ఎంతో ఆనందిస్తాయని ఆశిస్తున్నా' అని ట్వీట్‌ చేశాడు. ఈ జాబితాలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ జిల్లాల నుంచి మాత్రమే కాకుండా కర్ణాటక, తమిళనాడులోని ప్రాంతాల నుంచి కూడా విజేతలను ఎంపిక చేయడం విశేషం.

త్వరలోనే వీరికి హైదరాబాద్‌లో జరిగే ఖుషి గ్రాండ్ ఈవెంట్‌లో చెక్స్ పంపిణీ చేయబోతున్నారు. ఖుషి సినిమా విషయానికి వస్తే.. ఇందులో విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించారు. దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించిన ఈ లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ఈ నెల 1న రిలీజై హిట్‌ టాక్‌ అందుకుంది.

చదవండి: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన హీరోయిన్‌, షాక్‌లో ఫ్యాన్స్‌.. అనారోగ్య సమస్యలే కారణమా?

మరిన్ని వార్తలు