Vijay Deverakonda: ఫ్యాన్స్‌కు విజయ్ దేవరకొండ బంపర్‌ ఆఫర్.. అదేంటంటే..!

26 Dec, 2022 15:24 IST|Sakshi

టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ అభిమానులకు బంపర్‌ ఆఫర్ ప్రకటించారు.  ఈ ఏడాది క్రిస్మస్ కానుకగా 100 మందికి ఉచితంగా హాలిడే ట్రిప్‌ను స్పాన్సర్ చేయనున్నట్లు ప్రకటించారు.  దీనికి సంబంధించి డెస్టినేషన్‌ ఎంపిక చేసేందుకు సాయం చేయాలంటూ ట్విటర్‌ వేదికగా అభిమానులను కోరాడు. స్టార్ హీరో తన అభిమానులు గమ్యాన్ని ఎంచుకోవడంలో సహాయ పడటానికి సోషల్ మీడియాలో దీనిపై పోల్ నిర్వహించారు.

ట్విటర్‌లో విజయ్ రాస్తూ..- 'దేవరశాంత అనే సంప్రదాయాన్ని నేను 5 సంవత్సరాల క్రితం ప్రారంభించా. ఈ సంవత్సరం నాకు మంచి ఆలోచన ఉంది. నేను మీలో 100 మందిని అన్ని ఖర్చులు భరించి హాలిడే ట్రిప్‌కు పంపుతున్నా. డెస్టినేషన్‌ ఎంపికలో నాకు సహాయం చేయండి.' అంటూ ప్రకటించారు. విజయ్ తన ఫ‍్యాన్స్‌ డెస్టినేషన్ ఎంపిక చేసేందుకు భారతదేశంలోని పర్వతాలు, బీచ్‌లు, ఇండియా సాంస్కృతిక పర్యటన, ఇండియాలోని ఎడారి అంటూ నాలుగు ఆప‍్షన్స్ ఇచ్చారు.

అయితే విజయ్ ఈ సంప్రదాయాన్ని ఐదేళ్ల  క్రితమే ప్రారంభించినట్లు తెలిపారు. మొదటి ఏడాదిలో మాసబ్ ట్యాంక్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్శిటీని సందర్శించాడు. ఆ తర్వాత సోషల్ మీడియా 50 మంది ఫాలోవర్స్‌ను ఎంపిక చేసి వారికి ప్రత్యేక బహుమతులు అందించారు.  గతేడాది 100 మంది విజేతలకు క్రిస్మస్ కానుకగా ఒక్కొక్కరికి రూ.10,000 చొప్పున బహుమతులు అందజేసినట్లు ఆయన ప్రకటించారు. కాగా.. విజయ్ చివరిసారిగా పాన్-ఇండియా చిత్రం 'లైగర్'లో కనిపించాడు. ఇది అతని బాలీవుడ్ అరంగేట్రం చేసినప్పటికీ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తాకొట్టింది. ప్రస్తుతం సమంత రూత్ ప్రభుతో కలిసి 'ఖుషి' చిత్రంలో నటిస్తున్నారు.

మరిన్ని వార్తలు