Vijay: రాజకీయాల్లోకి దళపతి.. టార్గెట్ అదే..

8 Jun, 2023 08:45 IST|Sakshi

రాజకీయ అరంగ్రేటంలో భాగంగా దళపతి విజయ్‌ మరో అడుగు ముందుకు వేశారు. 2026 అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా వ్యూహాలకు ఆయన పదును పెడుతున్నట్లు ప్రస్తుతం రాజకీయవర్గాల్లో చర్చ జోరందుకుంది. ఇటీవల కాలంగా సేవలు విస్తృతం అవుతున్న నేపథ్యంలో ఈనెల 17వ తేదీన పది, ప్లస్‌– 2లో ఉత్తమ మార్కులను సాధించిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో భేటీకి విజయ్‌ సిద్ధమయ్యారు.

(ఇది చదవండి: పాపం ఐదేళ్లకే మతిపోయింది.. మెడిసిన్ వాడాల్సిందేనన్న డైరెక్టర్!)

నేపథ్యం ఇదీ..
సినీ నటుడు విజయ్‌ రాజకీయ ప్రవేశ చర్చ తరచూ తెర మీదకు వస్తున్న విషయం తెలిసిందే. అలాగే ఇటీవల కాలంలో తన చిత్రాల్లో రాజకీయంగా చర్చకు తావిచ్చే డైలాగులతో ఆయన ముందుకు సాగుతున్నారు. ఇది వివాదాలకు సైతం దారి తీస్తున్నాయి. అలాగే విజయ్‌ ఇటీవల కాలంగా వేస్తున్న అడుగులు 2026 అసెంబ్లీ ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని పయనం సాగిస్తున్నట్టుగా పలువురు భావిస్తున్నారు. అభిమానులతో జిల్లాల వారీగా సమీక్షలు, సమావేశాలతో విజయ్‌ అప్పుడప్పుడూ బీజీగానే ఉన్నారు.

అలాగే, ఒకే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా అభిమానుల ద్వారా సేవా కార్యక్రమాలను విస్తృతం చేయిస్తున్నారు. అలాగే, దివంగతులైన నేతల జయంతి కార్యక్రమాలను, ముఖ్య కార్యక్రమాలను అభిమానుల ద్వారా చేయిస్తున్నారు. అలాగే విజయ్‌ ఇయక్కంలో జాలర్లు, మహిళలు, విద్యార్థి విభాగాలను సైతం ఏర్పాటు చేసి ఉండడంతో రాజకీయ అరంగ్రేటానికి సమయం సమీపించిందనే చర్చ జోరందుకుంది. ఈ సమయంలో విజయ్‌ విద్యార్థులతో సంప్రదింపులకు సిద్ధమయ్యారు.

( ఇది చదవండి: డింపుల్ హయాతి వివాదం.. హైకోర్టును ఆశ్రయించిన హీరోయిన్!)

ఇటీవల వెలువడ్డ పది, ప్లస్‌–2 ఫలితాలలో ఉత్తమ ర్యాంకులు సాధించిన వారిని పిలిపించి, సత్కరించాలని నిర్ణయించారు. రాష్ట్రంలోని 234 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒక్కో నియోజక వర్గానికి ముగ్గురిని ఎంపిక చేశారు. ఈ విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులతోనూ సమావేశం కావాలని విజయ్‌ నిర్ణయించడం గమనార్హం. ఈనెల 17న ఈసీఆర్‌లోని ఓ కన్వెన్షన్‌ సెంటర్‌ వేదికగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.

మరిన్ని వార్తలు