థ్రిల్‌ అవుతారు

16 Oct, 2020 00:50 IST|Sakshi

నిత్యామీనన్‌ ఏదైనా ప్రాజెక్ట్‌లో భాగమైతే ఆటోమేటిక్‌గా ఆ సినిమా మీద ఆసక్తి పెరగడం ఖాయం. అందుకు కారణం ఆమె ఎంపిక చేసుకునే కథలు, చేసే పాత్రలు వినూత్నంగా ఉండటమే. తాజాగా మలయాళంలో ఓ ప్రాజెక్ట్‌ ఓకే చేశారామె. విజయ్‌ సేతుపతి, నిత్యామీనన్‌ జంటగా ఈ సినిమా తెరకెక్కనుంది. ఇందు వీయస్‌ అనే నూతన దర్శకురాలు ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఈ ఏడాది మొదట్లోనే ఈ సినిమా ప్రారంభం కావాల్సింది. కోవిడ్‌ వల్ల చిత్రీకరణ ప్రారంభం ఆలస్యం అయింది.

తాజాగా కేరళలో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభించనున్నారు. నిత్యామీనన్‌ మాట్లాడుతూ – ‘‘కథ వినగానే ఈ సినిమా నా టేస్ట్‌కి కరెక్ట్‌గా సరిపోయేది అనిపించింది. నాకు చాలా ఇష్టమైన స్టయిల్లో ఈ సినిమా కథ సాగుతుంది. మా పాత్రలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ఓ సాధారణ అమ్మాయి జీవితంలో జరిగిన అనూహ్య సంఘటనలతో ఈ కథ ఉంటుంది. ప్రేక్షకులు థ్రిల్‌ ఫీల్‌ అవుతారు’’ అన్నారు. ముందుగా ఇన్‌డోర్‌ సన్నివేశాలు చిత్రీకరించి, తర్వాత అవుట్‌ డోర్‌ సన్నివేశాలు తీస్తారని తెలిసింది.

మరిన్ని వార్తలు