Balagam: ‘బలగం’ చూస్తూ కన్నీళ్లు పెట్టుకున్న ఊరి జనం.. వీడియో వైరల్‌

2 Apr, 2023 13:27 IST|Sakshi

స్టార్‌ హీరోలు నటించలేదు.. వందల కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించలేదు.. ఐటం సాంగ్స్‌లేవు.. ఫైట్‌, రొమాన్స్‌ అసలేవు. కానీ ఆ సినిమా చూడడానికి జనాలు ఎగబడుతున్నారు. ఓటీటీలో స్ట్రీమింగ్‌ అవుతున్నా.. థియేటర్స్‌కి బారులు తీస్తున్నారు. ఇంకొన్ని రోజులు ఆగితే టీవిల్లోకి సినిమా వచ్చేస్తుంది. అయినా కూడా ఊరు ఊరంతా రచ్చబండ దగ్గరకు వచ్చి ఆ సినిమాను వీక్షించారు.  తెరపై కనిపించిన పాత్రల్లో తమని తాము ఊహించుకొని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇది మన కథ అంటూ ఎమోషనల్ అవుతున్నారు.ప్రేక్షకులు అంతగా ఓన్‌ చేసుకున్న ఆ సినిమానే ‘బలగం’.

తెలంగాణ పల్లె కుటుంబం నేపథ్యంలో చిన్న చిత్రంగా విడుదలైన బలగం.. భారీ విజయం సాధించింది. విడుదలై నెల రోజులు కావొస్తున్నా..ఇప్పటికీ జనాలు ఈ చిత్రం గురించే చర్చిస్తున్నారు. అంతేకాదు పాత కాలంలోలాగా గ్రామాల్లో స్పెషల్‌ షోలు వేస్తున్నారు. తెలంగాణలోని చాలా పల్లెల్లో రచ్చబండ వద్ద ఈ చిత్రాన్ని ప్రదర్శిస్తున్నారు.

ఓ గ్రామంలో సినిమా చూస్తూ వృద్ధులు, మహిళలు కన్నీళ్లు పెట్టుకున్నారు. చీరకొంగుతో కన్నీళ్లుతను తుడుచుకుంటూ సినిమాను వీక్షించారు. దీనికి సంబంధించిన వీడియోని ఓ నెటిజన్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో అది వైరల్‌ అయింది.  ఈ వీడియోపై బలగం హీరో ప్రియదర్శి స్పందించారు. ‘ఇది నా సినిమానేనా?’అంటూ ట్వీట్‌ చేశాడు. కమెడియన్‌ వేణు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రియదర్శి, కావ్య కల్యాణ్‌రామ్ కీలక పాత్రలు పోషించారు. భీమ్స్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూర్చాడు.

మరిన్ని వార్తలు