Satya Prakash: పిలిచి మరీ వేషం ఇచ్చారు, అందుకు ఇప్పటికీ బాధపడుతున్నారు

9 Mar, 2022 19:42 IST|Sakshi

టాలీవుడ్‌లో ప్రతినాయకుడిగా మెప్పించినవారిలో నటుడు సత్య ప్రకాశ్‌ ఒకరు. ఈయన తాజాగా ఓ టీవీ షోలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా అతడు పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. విజయనగరంలో పుట్టిన తాను ఒడిశాలో పెరిగానని, ఆ తరువాత బ్యాంకులో ఉద్యోగం చేశానని చెప్పుకొచ్చాడు. తానేదో పిచ్చిపనులు చేస్తుంటే ఓ డైరెక్టర్‌ రా బాబు అంటూ పిలిచి మరీ సినిమాలో వేషం ఇచ్చారని, కానీ ఆయన తనను ఆర్టిస్టును చేసినందుకు ఇప్పటికీ బాధపడుతున్నారని నవ్వుతూ పేర్కొన్నాడు.

తనను ఆర్టిస్టును చేసి జీవితంలో పెద్ద తప్పు చేశానని ఫీల్‌ అవుతున్నారని సరదాగా చెప్పుకొచ్చాడు. ఇప్పటిదాకా దాదాపు 600 సినిమాల్లో నటించానని చెప్పుకుంటూ ఉంటానన్నాడు. తనను సెట్స్‌లో అవమానించిన సంఘటనను తలుచుకుంటూ.. 'ఒక సినిమా షూటింగ్‌లో సుమన్‌తో ఫైట్‌ సీన్‌లో నటించాలి. ఆయన కొట్టినప్పుడు రియాక్షన్‌ ఇవ్వాలి. కానీ నేనివ్వలేదు. అప్పుడు అక్కడున్న కో డైరెక్టర్‌ నన్ను ఉద్దేశించి.. ఇలాంటి దరిద్రపువాళ్లంతా ఇండస్ట్రీకి వచ్చేస్తున్నారు. అందుకే ఇండస్ట్రీ నాశనం అయిపోతుంది' అన్నారు అని వాపోయాడు సత్య.

మరిన్ని వార్తలు