మొద‌టిసారి సుమ‌ను ట్రోల్ చే‌స్తున్న‌ నెటిజన్లు‌.. కార‌ణం ఏంటంటే!

26 Apr, 2021 18:11 IST|Sakshi

సుమ కనకాల.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ద‌క్షిణాది ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం అవ‌స‌రం లేని పేరు. పుట్టి పెరిగింది కేర‌ళ‌లో అయినా టాలీవుడ్ బుల్లితెర‌పై ఓ వెలుగు వెలుగుతున్నారు. యాంకరింగ్‌లో త‌న‌కు ఎవ‌రూ సాటి లేర‌న్న విధంగా ముందుకు సాగుతున్నారు. ఏ కార్య‌క్ర‌మం, ఆడియో ఫంక్ష‌న్‌, ఈవెంట్ అయిన యాంక‌ర్‌గా సుమ ఉండాల్సిందే. త‌న మాట‌ల‌తో చిన్న నుంచి పెద్ద‌ల వ‌రకు అంద‌రిని ఆక‌ట్టుకుంటున్నారు. సుమ వేసే పంచులు, మాట‌ల‌తో షో ఖ‌చ్చితంగా హిట్ అవుతుంద‌ని అంద‌రి అభిప్రాయం. ఇప్ప‌టి వ‌ర‌కు త‌న కెరీర్‌పై ఎలాంటి నెగటివ్ లేకుండా హాయిగా ఉన్న సుమ‌.. తాజాగా నెటిజ‌న్ల ట్రోల్స్‌కు గుర‌య్యారు. సుమపై కొందరు ఫైర్ అవుతూ.. క్రూరత్వం కనిపించలేదా అంటూ విమ‌ర్శిస్తున్నారు.

ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే.. తనకు సంబంధించిన కొన్ని విష‌యాల‌ను సుమ ఎప్ప‌టిక‌ప్పుడు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటారు. ఇక ఆమెకు మూగజీవులు అంటే ఇంకా ఇష్టం. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఓ ఆవు, దూడతో స‌రదాగా గ‌డిపిన వీడియోను పోస్టు చేసింది. ఇందులో రాముడు అంటూ ఆవు దూడ‌ను ప్రేమ‌గా ద‌గ్గ‌ర‌కు పిలుచుకుంటోంది. వీడియోలో దూడ మూతికి అడ్డంగా వెదురు బుట్టి లాంటిది పెట్టారు. అయితే ఇది కొంత‌మంది నెటిజ‌న్ల ఆగ్ర‌హానికి గురైంది. దూడ మూతిని పాలు తాగకుండా అలా కట్టేసారని ప్ర‌శ్నిస్తున్నారు. ఇంతటి క్రూరత్వం మీకు కనిపించడం లేదా అని సుమపై ఫైర్ అవుతున్నారు. కానీ మ‌రో వ‌ర్గం వారు.. దూడ ఏది పడితే అది తింటే ఆరోగ్యం చెడిపోతుందని, మోతాదుకు మించి ఎక్కువ పాలు తాగితే ప్రమాదకరమని, కాబట్టి అలా మూతికి అడ్డుకడతారని సుమ‌కు అండ‌గా నిలుస్తున్నారు.

సుమ తొలి యాంకరింగ్‌ ప్రోగ్రాం ఏంటో తెలుసా?

>
మరిన్ని వార్తలు