బిహార్‌లో టీచర్‌ జాబ్‌ కొట్టేసిన అనుపమ!

25 Jun, 2021 10:00 IST|Sakshi

మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్‌ టెట్‌ పరీక్షలో మంచి మార్కులతో పాసయిందట. అదేంటి.. ఆమె టీచర్‌ కావాలనుకుంటుందా? మరి సినిమాల సంగతేంటి అంటారా? అది బిహార్‌ ప్రభుత్వాన్నే అడగాలి. ఎందుకంటే ఆమె టీచర్‌ అవాలనుకుంటుందో లేదో కానీ అనుపమను టీచర్‌ చేయాలనుకుంటోంది బిహార్‌ విద్యాశాఖ. అదెలా అంటారా? అయితే ఈ వార్త చదివేయండి..

బిహార్‌ విద్యాశాఖ ఇటీవలే సెకండరీ టీచర్స్‌ ఎలిజిబులిటీ టెస్ట్‌(STET) ఫలితాలను వెల్లడించింది. ఇందులో రిషికేశ్‌ కుమార్‌ అనే వ్యక్తి 77 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాడు. కానీ స్కోర్‌ కార్డులో అతడి ఫొటో లేదు. తన ఫొటోకు బదులుగా అనుపమ పరమేశ్వరన్‌ ఫొటో వచ్చింది. దీంతో షాకైన అతడు దీన్ని సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు.

"ఇదేమీ మొదటి సారి కాదు. నా అడ్మిట్‌ కార్డు మీద కూడా అనుపమ ఫొటో వచ్చింది. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్తే దాన్ని సరిదిద్దుతామని చెప్పారు. కానీ ఎలాంటి మార్పులు చేయకపోవడంతో అదే అడ్మిట్‌ కార్డుతో పరీక్షలు రాశాను. ఇప్పుడు రిజల్ట్స్‌లో కూడా మళ్లీ అనుపమ ఫొటోనే వచ్చింది" అని చెప్పుకొచ్చాడు. ఈ వ్యవహారం కాస్తా వైరల్‌ కావడంతో స్పందించిన విద్యాశాఖ అధికారి సంజయ్‌ కుమార్‌ ఈ ఘటనపై దర్యాప్తుకు ఆదేశించామని తెలిపారు.

బిహార్‌ విద్యాశాఖలో గతంలోనూ ఇలాంటి తప్పిదాలు చోటు చేసుకున్నాయి జూనియర్‌ ఇంజనీర్‌ పరీక్షలో బాలీవుడ్‌ బ్యూటీ సన్నీలియోన్‌ను టాపర్‌గా ప్రకటించి నవ్వులపాలైన విషయం తెలిసిందే.

చదవండి: ప్రేమ సన్నివేశాల్లో నిఖిల్ ఎవరిని ఊహించుకుంటాడో తెలుసా?

మరిన్ని వార్తలు