ప్రభాస్‌కు పోటీగా మహేశ్‌ ‘రామాయణం’.. సీతగా స్టార్‌ హీరోయిన్‌!

30 Mar, 2021 14:47 IST|Sakshi

రామాయణం ఇతిహాసంపై ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. వస్తూనే ఉన్నాయి. అయినప్పటికీ ఈ మహాకావ్యం నేపథ్యంలో వచ్చే సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తూనే ఉన్నారు. తాజాగా యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ కూడా ఈ ఇతిహాసం నేపథ్యంలోనే ‘ఆదిపురుష్‌’ సినిమా చేస్తున్నాడు. ఓం రౌత్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్‌ రాముడిగా కనిపించనున్నాడు. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ రావసణుడిగా నటిస్తున్నాడు. సీతగా కృతి సనన్‌ నటిస్తోంది. పాన్ ఇండియా లెవల్లో 3డీ టెక్నాలజీలో ఈ సినిమాని రూపొందిస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ చిత్రానికి పోటీగా సూపర్ స్టార్ మహేశ్‌ బాబు సినిమా రాబోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి.  

ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్‌, మధు మంతెన కలిసి రామాయణాన్ని 3డి ఫార్మాట్ లో తీయడానికి సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తోంది. ‘దంగల్‌’ దర్శకుడు నితీష్‌ తివారీ, ‘మామ్‌’ దర్శకుడు రవి ఉడయార్‌ దర్శకత్వం వహించనున్నారట. వాస్తవానికి రామాయణం ఇతీహాసం నేపథ్యంలో సినిమాను తెరకెక్కించబోతున్నట్లు మధు మంతెన, అల్లు అరవింద్‌ గతంలో అధికారికంగా ప్రకటించారు.

ఈ సినిమాని మూడు భాగాలుగా తెరకెక్కించబోతున్నామని, మొదటి భాగాన్ని 2021లో విడుదల చేస్తామని చెప్పారు. కానీ అది కార్యరూపం దాల్చలేదు. ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్‌డేట్‌ రాలేదు. ఇప్పుడు ప్రభాస్‌ ‘ఆదిపురుష్‌’ చేస్తున్న తరుణంలో మరోసారి ఈ ప్రాజెక్టు వార్తల్లో నిలిచింది. మహేశ్‌తో ఈ ప్రాజెక్టుని తెరకెక్కించాలని నిర్మాతలు మళ్లీ ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టు గురించి ఆయనతో చర్చలు మొదలు పెట్టినట్లు సమాచారం. ఇక ఈ సినిమాలో సీతగా దీపికా పదుకోన్‌, రావణుడ హృతిక్‌ రోషన్‌ నటించబోతున్నట్లు టాక్‌. మరి మహేశ్‌ రామాయణం ఎప్పడు పట్టాలెక్కుతుందో చూడాలి.

మరిన్ని వార్తలు