మాధురీ దీక్షిత్‌ను ఫిదా చేసిన యువతి

9 Feb, 2021 10:38 IST|Sakshi

మట్టిలో మాణిక్యాలు ఎంతోమంది ఉన్నారు. తమలో ప్రతిభ ఉన్నప్పటికీ దానిని గుర్తించి సరైన ప్రోత్సాహం అందించేవారు లేకపోవడంతో వెలుగులోకి రావడం లేదు. అలాంటి వారికి సోషల్‌ మీడియాలో వేదికగా మారుతోంది. దేశం నలుమూలలా జరిగే చిన్న చిన్న సంఘటనలను సైతం ప్రపంచానికి పరిచయం చేస్తోంది. అలాంటి ఓ దృశ్యం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఓ పల్లెటూరి యువతి డ్యాన్స్‌ చేస్తున్న వీడియోను నటి మాధురీ దీక్షిత్‌ ట్విటర్‌లో షేర్‌ చేశారు. రాగిరీ అనే ఓ ట్విటర్‌ యూజర్‌ ఈ వీడియోను మొదట షేర్‌ చేస్తూ అలనాటి తారలు మాధురీ దీక్షిత్‌, హేమ మాలినిని ట్యాగ్‌ చేశారు. యువతి నృత్యంపై వారి అభిప్రాయాలు తెలపాలని కోరారు. రెండున్నర నిమిషాల నిడివి గల ఈ వీడియోలో ఓ విలేజ్‌ గర్ల్  పొలాల మధ్య అద్భుతంగా స్టెప్పులు వేస్తూ కనిపిస్తోంది. 

1957లో వచ్చిన హిట్‌ చిత్రం ‘మదర్‌ ఇండియా’లోని రాజేంద్ర కుమార్, కుమ్‌కుమ్ న‌టించిన గోగత్‌ నహీన్‌..అనే పాటకు ఆ యువతి ఎక్కడా తడబడకుండా సూపర్‌ ఎక్స్‌ప్రెషన్స్‌తో అలరించింది. ఈ డ్యాన్స్‌ వీడియోపై స్పందించిన ఈ బాలీవుడ్‌ భామ‌.. యువతిపై  ప్రశంసలు కురిపించారు. ఆ పోస్టుకు ‘వావ్‌! అమ్మాయి అద్భుతంగా డ్యాన్స్‌ చేస్తోంది. ప్రపంచానికి పరిచయం చేయాల్సిన టాలెంట్‌ ఎంతో ఉంది’. అంటూ కొనియాడారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. కాగా. ఆ యువతి వివరాలు తెలియరాలేదు కానీ,  వీడియోను షేర్‌ చేసిన ‘రాగిరీ’ సంస్థవారు సంప్రదాయ సంగీతాన్ని, నృత్యాన్ని ప్రమోట్‌ చేస్తూ ఉంటారు. మరి అంతలా ఆకట్టుకుంటున్న ఆ యువతి డ్యాన్స్‌ను మీరు కూడా చూసేయండి.
చదవండి: ఆమె విషయంలో చిరంజీవి చెప్పిందే నిజమవుతోంది!
మూడోసారి తల్లి కాబోతున్న నటి

మరిన్ని వార్తలు