Virata Parvam Pre Release Event: ఇదే చివరి సినిమా.. ఇకపై పిచ్చెక్కిచ్చేద్దాం: రానా

16 Jun, 2022 08:26 IST|Sakshi
శ్రీకాంత్‌, వేణు ఊడుగుల, వెంకటేశ్‌, సాయి పల్లవి, రానా, సుధాకర్‌ చెరుకూరి

విరాటపర్వంలాంటి సినిమాలు రావాలి – వెంకటేష్‌

‘‘విరాటపర్వం’ లాంటి సినిమాలు రావాలి. ట్రైలర్‌ చూసినప్పుడే ఇది చాలా మంచి సినిమా అనుకున్నాను. ఇలాంటి చాలెంజింగ్‌ సబ్జెక్ట్‌ని ఎంచుకున్నందుకు నిర్మాతలను అభినందిస్తున్నాను’’ అని హీరో వెంకటేష్‌ అన్నారు. రానా దగ్గుబాటి, సాయిపల్లవి జంటగా వేణు ఊడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘విరాటపర్వం’. డి. సురేష్‌బాబు సమర్పణలో సుధాకర్‌ చెరుకూరి నిర్మించిన ఈ సినిమా రేపు (శుక్రవారం) విడుదలవుతోంది.

ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్‌ వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొన్న వెంకటేష్‌ మాట్లాడుతూ– ‘‘తొలి సినిమా ‘లీడర్‌’ నుంచి రానా ఏ సినిమా తీసుకున్నా చాలా క్రమశిక్షణతో ఆ పాత్ర కోసం కష్టపడతాడు. తను ‘విరాటపర్వం’ సినిమా చేయడం చాలా సంతోషంగా ఉంది.. ప్రేక్షకులకు తన పాత్ర నచ్చుతుంది. ‘రానా నువ్వు విన్నర్‌ అవుతావు.. వెంటనే కాదు కానీ తప్పకుండా విన్నర్‌ అవుతావు’. మన తెలుగు ఇండస్ట్రీకి వేణులాంటి ఓ నిజాయతీ గల ఫిల్మ్‌ మేకర్‌ వచ్చాడు. ‘విరాటపర్వం’ లాంటి కథను తీసుకోవడం, ఎగ్జిక్యూట్‌ చేయడంలో సక్సెస్‌ అయ్యాడు. ఈ చిత్రానికి సాయిపల్లవి జాతీయ అవార్డు అందుకుంటుంది. సాంకేతిక నిపుణులందరూ కష్టపడ్డారు. ఈ సినిమా మంచి విజయం సాధించాలి’’ అన్నారు.

(చదవండి: ఆ విషయంలో వెన్నెల.. నేనూ ఒకటే! )

రానా మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాలో ఆరు ముఖ్య పాత్రల్లో 5 పాత్రలను మహిళలు చేశారు.. అందుకే ఇది పెద్ద మహిళా చిత్రం. మా బాబాయ్‌ వెంకటేశ్‌గారికి ఫ్యాన్స్‌ ఉన్నారని తెలుసు కానీ నాకు ఉంటారనుకోలేదు. ‘విరాటపర్వం’ ఒప్పుకున్నప్పుడు నాకెంతమంది అభిమానులున్నారో తెలిసింది. ఇలాంటి ప్రయోగాత్మక సినిమాలు చేయొద్దని అన్నారు. నటుడిగా ఇది నా చివరి ప్రయోగాత్మక చిత్రం. ఇకపై మీకోసం సినిమాలు చేస్తా.. పిచ్చెక్కిచ్చేద్దాం’’ అన్నారు. సుధాకర్‌ చెరుకూరి మాట్లాడుతూ– ‘‘మూడేళ్లు కష్టపడి ‘విరాటపర్వం’ చేశాం. మీరందరూ థియేటర్స్‌కి వచ్చి సినిమా చూడండి.. మా కష్టం ఏంటో మీకు తెలుస్తుంది’’ అన్నారు.

మరిన్ని వార్తలు