Rana On Virata Parvam Movie: విరాటపర్వం ఎమోషనల్‌ లవ్‌ స్టోరీ 

17 Jun, 2022 11:28 IST|Sakshi

యథార్థ సంఘటనల ఆధారంగా నిర్మించిన చిత్రమిది 

సందడి చేసిన చిత్ర యూనిట్‌

సాక్షి, విశాఖపట్నం: విరాటపర్వం చిత్రం కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా నిర్మించిన ప్రేమకథా చిత్రమని చిత్ర హీరో రానా దగ్గుబాటి తెలిపారు. శుక్రవారం విరాటపర్వం చిత్రం విడుదల సందర్భంగా గురువారం సాయంత్రం మర్రిపాలెం వద్ద గల మారియట్‌ హోటల్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హీరో రానా, హీరోయిన్‌ సాయిపల్లవి, దర్శకుడు వేణు ఊడుగుల పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు వేణు మాట్లాడుతు ఇది 1992లో జరిగిన ఓ సంఘటన ఆధారంగా నిర్మించిన చిత్రమన్నారు. అచ్చ తెలుగు వాతావరణంలో, అచ్చమైన సంప్రదాయం మేళవించి తీసిన అచ్చ తెలుగు చిత్రమని దర్శకుడు తెలిపారు.

రెండు తెలుగు రాష్ట్రాలలో టికెట్‌ ధరలు కూడా ప్రేక్షకులకు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. చిత్రం అందరికీ నచ్చుతుందని, ఇటువంటి చిత్రాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన బాధ్యత మీడియా మీదే ఉందన్నారు. హీరో రానా మాట్లాడుతూ ఈ చిత్రంలో యాక్షన్, సెంటిమెంట్‌ లాంటి అంశాలెన్ని ఉన్నా మొత్తం మీద ఇదొక ఏమోషనల్‌ లవ్‌స్టోరీ అని తెలిపారు. హీరోయిన్‌ సాయిపల్లవి మాట్లాడుతు విశాఖ చాలా అందంగా ఉందన్నారు. వీలైతే విశాఖ అందాలన వీక్షించేందు ప్రత్యేకంగా వస్తానని చెప్పారు. విరాటపర్వం చిత్రం హీరోయిన్‌ ఆధారిత ప్రేమకథా చిత్రమని తెలిపారు. 

విజ్ఞాన్‌లో సందడి 
దువ్వాడ విజ్ఞాన్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో విరాట పర్వం చిత్ర కథానాయిక సాయి పల్లవి, చిత్ర దర్శకుడు వేణు ఊడుగుల సందడి చేశారు. విజ్ఞాన్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో స్టూడెంట్స్‌ యాక్టివిటీ కౌన్సిల్‌ (ఎస్‌ఎసీ) నిర్వహించిన కార్యక్రమంలో వారు పాల్గొని విద్యార్థులతో సందడి చేశారు. విరాట పర్వం చిత్రంలో దగ్గుపాటి రానా, సాయిపల్లవి నటిస్తున్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల రెక్‌ట్రా వి.మధుసూధనరావు, ప్రిన్సిపాల్‌ బి.అరుంధతి, వైస్‌ ప్రిన్సిపాల్‌ కె.మధుసూదనరావు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు