బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షం కురిపిస్తున్న కాకులు!

23 Apr, 2023 18:23 IST|Sakshi

సాధారణంగా కొన్ని సినిమాల్లో జంతువులకు అధిక ప్రాధాన్యత ఇస్తారు దర్శకులు. ముఖ్యంగా పెంపుడు కుక్క, గుర్రం, ఏనుగు లాంటి జంతువులను బేస్‌ చేసుకొని సినిమాలను తెరకెక్కించారు. వాటిలో చాలా వరకు విజయం సాధించాయి. అంతేకాదు హీరో కంటే ఆ జంతువులకు సంబంధించిన సన్నివేశాలే ప్రేక్షకులను అలరించిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఈ మధ్య కాలంలో మన దర్శకుల కన్ను కాకులపై పడింది. కాకులను బేస్‌ చేసుకొని సన్నివేశాలను రాసుకుంటున్నారు. అవి ప్రేక్షలను బాగా ఆకట్టుకుంటున్నాయి.  కాకి కాన్సెప్ట్‌తో వచ్చి బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షాన్ని కురిపించిన చిత్రాలపై ఓ లుక్కేద్దాం. 

కాకి కాన్సెప్ట్‌ అనగానే ఇప్పుడు అందరికి గుర్తొచ్చె సినిమా ‘బలగం’. ఓ మనిషి తదానానంతరం కాకి పిండం ముట్టడం అనే కాన్సెప్ట్‌తో ఈ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు వేణు.  తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో మనిషి చనిపోయిన తర్వాత కాకి పిండంను తినకపోవడం గురించి చూపించారు. కథంతా కాకి చుట్టే తిరుగుతుంది. మార్చి 3న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద భారీ వసూళ్లను సాధించింది. 

ఇక రీసెంట్‌గా సుప్రీమ్‌ హీరో సాయి ధరమ్‌ తేజ్‌ హీరోగా నటించిన ‘విరూపాక్ష’చిత్రంలోనూ కాకికి ఇంపార్టెంట్‌ రోల్‌ లభించింది. క్షుద్రపూజల నేపథ్యంలో మిస్టరీ,థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం.. ఏప్రిల్‌ 21న విడుదలై పాజిటివ్‌ టాక్‌ని సంపాదించుకుంది. ప్రేక్షకులను భయపెట్టడానికి కాకిని చాలా సన్నివేశాల్లో వాడారు. ముఖ్యంగా క్లైమాక్స్‌లో కాకులన్నీ గుంపుగా వచ్చి అగ్నికి ఆహుతి అవ్వడం అనేది సినిమాకి హైలెట్‌గా నిలిచింది.

అలాగే ఇటీవల విడుదలైన నాని తొలి పాన్‌ ఇండియా చిత్రం ‘దసరా’లోనూ కాకిని వాడేశారు. ఈ సినిమాలో కూడా కాకి పిండాన్ని తినకపోవడాన్ని చూపించాడు దర్శకుడు శ్రీకాంత్ ఓదెల.  ఈ మూడు చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయం సాధించడంతో టాలీవుడ్‌కి కాకి సెంటిమెంట్‌గా మారిపోయింది. మరి ఈ కాకుల కాన్సెప్ట్‌తో ఇంకెన్ని చిత్రాలు వస్తాయో చూడాలి. 

(చదవండి: పెళ్లికి ముందే ప్రెగ్నెంట్‌ అయిన హీరోయిన్లు వీరే)

మరిన్ని వార్తలు