పవన్‌‌తో స్క్రీన్‌ షేర్‌ చేసుకోనున్న డైరెక్టర్‌!

6 Feb, 2021 19:46 IST|Sakshi

టాలీవుడ్‌ దర్శకుల్లో చాలా మంది అప్పుడప్పుడు వెండితెరపై మెరుస్తుంటారు. ఏదో ఒక సన్నివేశాల్లో ఇలా వచ్చి అలా వెళ్లిపోతుంటారు. అలాంటి వాళ్లల్లో ముందుంటారు ప్రముఖ​ దర్శకుడు వీవీ వినాయక్‌. వీలున్నప్పుడల్లా వెండి తెరపై ప్రత్యక్షమవుతూ తనలోని నటుడిని బయటపెడుతుంటాడు. గతంలో అలా 'ఠాగూర్', 'ఖైదీ నెంబర్ 150' వంటి చిత్రాలలో చిన్న చిన్న పాత్రల్లో నటించారు. తాజాగా ఆయన మరో చిత్రంలో నటిస్తున్నట్టు సమాచారం. అది ఆయన దర్శకత్వం వహిస్తున్న సినిమా కాకపోవడం ఒక విశేషం అయితే.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమా కావడం మరో విశేషం.

మలయాళం సూపర్‌ హిట్‌ 'అయ్యప్పనుమ్ కోషియమ్' చిత్రాన్ని తెలుగులో పవన్ కల్యాణ్ హీరోగా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. సాగర్ కె. చంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో రానా దగ్గుబాటి కూడా కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో వీవీ వినాయక్ కూడా ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన షూటింగులో కూడా ఆయన ఇటీవల పాల్గొన్నట్టు సమాచారం. గచ్చిబౌలిలోని అల్యూమినియం ఫ్యాక్టరీలో జరిగిన షూటింగ్లో‌ ఆయనపై చిత్రీకరణ జరిగినట్టు సమాచారం. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లేను సమకూర్చడంతో పాటు మాటలు కూడా రాస్తున్నారు.

మరిన్ని వార్తలు