ఓటీటీ రిలీజ్‌ అంత ఈజీ కాదు : డైరెక్టర్‌

19 Jul, 2022 15:11 IST|Sakshi
వార్డు 126 చిత్రంలోని దృశ్యం

నలుగురు కథానాయికలతో రూపొందుతున్న చిత్రం వార్డు 126. సెల్వకుమార్‌ సెల్లపాండియన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సీత దేవదాస్‌ శ్రిత శివదాస్, చాందిని తమిళరసన్, విద్యా ప్రదీప్, శృతి రామకృష్ణ నలుగురు కథానాయికలుగా నటిస్తుండగా, మైకెల్‌ తంగదురై, జిష్ణు మీనన్, కథానాయకులుగా నటిస్తున్నారు. నటి సోనియా అగర్వాల్, శ్రీమాన్‌ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

చిత్ర వివరాలను దర్శకుడు తిరుపతి మాట్లాడుతూ.. ఇది మహిళల ఇతివృత్తంతో కూడిన రొమాంటిక్‌ థ్రిల్లర్‌ కథాచిత్రంగా ఉంటుందన్నారు. ఒక వ్యక్తి నిబద్ధతను ఆవిష్కరించే చిత్రం ఇదన్నారు. ఏ అంశాలకైన రెండు ముఖాలు ఉంటాయని, తాను ఐటీ కంపెనీలో పనిచేస్తున్నప్పుడు జరిగిన సంఘటనను రెండు వైపులా ఆవిష్కరించే ప్రయత్నం చేసినట్లు తెలిపారు. చెన్నై, బెంగళూరు, ఢిల్లీ సమీపంలోని నోయిడా ప్రాంతాల్లో షూటింగ్‌ నిర్వహించామని, పాటలను పాండిచ్చేరిలో చిత్రీకరించినట్లు తెలిపారు.

కరోనా కాలంలో ఈ చిత్రాన్ని పలు అవరోధాలు తట్టుకొని పూర్తి చేసినట్లు చెప్పారు. దీన్ని త్వరలోనే థియేటర్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. ఓటీటీ విడుదలకు తలుపులు తెరిచే ఉన్నాయని అన్నారు. అయితే చాలా మంది చిత్రాలను ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌లో విడుదల చేయడం సులభం అని అనుకుంటున్నారని, అయితే అది అంత సులభమైన విషయం కాదని దర్శకుడు పేర్కొన్నారు. ఎస్‌ఎస్‌బీ టాకీస్‌ సంస్థ నిర్మించిన ఈ చిత్రాన్ని యాక్షన్‌ రియాక్షన్‌ ఫిలిమ్స్‌ సంస్థ విడుదల హక్కులను పొందినట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు