ఓటీటీకి సైన్ చేసింది, ఫేమ్‌ తెచ్చుకుంది

14 Feb, 2021 07:47 IST|Sakshi

అయేషా అహ్మద్‌.. సిరీస్‌ కన్నా ముందు టీవీ కమర్షియల్స్‌తో ప్రేక్షకులకు దగ్గరైన మోడల్‌. రూపంతోనే కాదు నటనతోనూ ఆకట్టుకుంది. ఇప్పుడు వెబ్‌ సిరీస్‌తో వీక్షకుల మనసుల్లో స్థిరపడిపోయింది. పుట్టింది, పెరిగింది ముంబైలో.  తల్లి.. రుక్సర్‌.. జన్మనిచ్చిన  తండ్రి.. అసద్‌ అహ్మద్‌. తర్వాత రుక్సర్‌ .. అసద్‌కు విడాకులిచ్చి ఫిల్మ్‌మేకర్‌ ఫారూక్‌ కబీర్‌ను పెళ్లి చేసుకోవడంతో అయేషా అతని సంరక్షణలోనే పెరిగింది. 

అయేషా తల్లి రుక్సర్‌ కూడా నటే. సర్కార్, గాడ్‌ తుస్సీ గ్రేట్‌ హో, పీకే వంటి సినిమాల్లో కీలక పాత్రల్లోనే నటించింది. అలా నటనను తల్లి నుంచి(రుక్సర్‌ అహ్మద్‌ నటీమణి) , ఆఫ్‌ స్క్రీన్‌ టెక్నిక్స్‌ సవతి తండ్రి నుంచి నేర్చుకుంది అయేషా. గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశాక సినిమా రంగంలోకి అడుగుపెట్టింది. ముందు మోడలింగ్‌ అవకాశాలు వచ్చాయి.

మోడలింగ్‌ చేస్తూనే సినిమాల్లో అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా చేరింది. వాయిస్‌ ఓవర్‌ ఆర్టిస్ట్‌గానూ పని చేసింది. ఆ సమయంలోనే అంటే 2016లో ‘తుమ్‌ బిన్‌ 2’ సినిమాలో చాన్స్‌ రావడంతో నటిగా పరిచయం అయింది. అదే సంవత్సరం రూబరూ అనే సినిమాలోనూ నటించింది. 2018లో ‘త్రీ స్టోరీస్‌’తో రేణుక సహానే, షీబా చద్దా వంటి మేటి నటీమణులతో స్క్రీన్‌ షేర్‌ చేసుకుంది అయేషా. అడల్టింగ్‌ అనే సిరీస్‌ (2020)తో ఓటీటీకీ సైన్‌ చేసింది.. ఫేమ్‌ సంపాదించుకుంది. యూట్యూబ్‌ వీడియోలతోనూ నేమ్‌ తెచ్చుకుంటోంది. కొంచెం టైమ్‌ దొరికినా జిమ్‌కి వెళ్లిపోతుంది. ఏ కాస్త వెసులుబాటు ఉన్నా ప్రయాణాన్ని ఆస్వాదిస్తుంది.

మరిన్ని వార్తలు