Lata Mangeshkar : హీరో వచ్చి నచ్చజెప్పినా పాడనని తేల్చిచెప్పిన లతాజీ..

6 Feb, 2022 17:04 IST|Sakshi

When Lata Mangeshkar Refused To Sing Raj Kapoor Song: లతా మంగేష్కర్‌ లెగసీ గురించి వర్ణించడానికి పదాలు చాలవు. ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న సంగీత సరస్వతి ఆవిడ. చిన్న వయసులోనే స్టార్‌ సింగర్‌గా ఫేమ్‌ తెచ్చుకున్నారు. తండ్రి మరణంతో తప్పనిసరై పాటలు పాడేందుకు చిత్ర పరిశ్రమలోకి రావాల్సి వచ్చిన లతాజీ ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని నిలిచారు. లతా మంగేష్కర్‌ తొలిసారి ఓ మరాఠీ చిత్రంతో నేపథ్య గాయనిగా మారారు.

అయితే ఎడిటింగ్‌లో ఆ పాటను తీసేశారు. కానీ ఆ తర్వాత ఆమె ప్రస్థానం ఊహించని రీతిలో మలుపు తిరిగింది. 'అజీబ్‌ దస్తాన్‌ హై యే', 'ప్యార్‌ కియా తో డర్నా క్యా', 'నీలా అస్మాన్‌ సో గయా', 'తేరే లియే' వంటి అనేక గీతాలకు ఆమె గాత్రంతో ప్రాణం పోశారు. అసలు ఆమె కాల్షిట్ల కోసం సంగీత దర్శకులు పోటీ పడేవారంటే ఆమె స్థాయి ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. అయితే ఎంత ఎత్తుకు ఎదిగినా తన కట్టుబాట్లు, సాంప్రదాయాలకు ఎంతో విలువిచ్చే లతాజీ సినిమాల్లో ద్వందర్థాలు వచ్చే పాటలు పాడేందుకు ససేమీరా నిరాకరించేవారు.

అలా ఆమె పాడనని మొండికేయడంతో ఎన్నో పాటల లిరిక్స్‌ని సైతం మార్చాల్సి వచ్చింది. 1964లో సంగం సినిమా కోసం 'మై కా కరూ రామ్‌ ముఝే బుడ్డా మిల్‌ గాయా' పాట విషయంలో ప్రముఖ హీరో రాజ్‌కపూర్‌తో గంటన్నరకు పైగా లతాజీకి వాగ్వాదం జరిగింది. పాటలో సాహిత్యం బాగుందని ఎంతగా నచ్చజెప్పినా లతాజీ మాత్రం వినలేదట. దీంతో ఆ పాటను వేరే వాళ్లతో పాడించారట. అనూహ్యంగా ఆ పాట సూపర్‌హిట్‌గా నిలిచింది. కానీ ఇంతవరకు ఆ పాటను కానీ, ఆ సినిమాను కానీ చూడలేదని లతాజీ ఓ ఇంటర్వ్యూలో చెప్పడం గమనార్హం. 

చదవండి: లతా మంగేష్కర్ పెళ్లి చేసుకోకపోవడానికి కారణమేంటో తెలుసా? 

మరిన్ని వార్తలు