నా చావుకు అజితే కారణం: పెట్రోల్‌ పోసుకుని మహిళ ఆత్మహత్యాయత్నం

5 Oct, 2021 19:14 IST|Sakshi

చెన్నై: తమిళ స్టార్‌ హీరో అజిత్‌ ఇంటి ముందు కలకలం చెలరేగింది. పెట్రోల్‌ పోసుకుని ఓ మహిళా అభిమాని మంగళవారం నాడు ఆత్మహత్యకు యత్నించింది. అజిత్‌ను కలిసేందుకు ఎంతగానో ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని, ఇంకా ఎన్నాళ్లు పోరాడాలని, తన చావుకు అజితే కారణమంటూ కేకలు వేసింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

జాతీయ మీడియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. ఫర్జానా అనే మహిళ ఓ ఆసుపత్రిలో నర్సుగా పని చేస్తోంది. గతేడాది అజిత్‌, తన భార్య షాలినితో కలిసి సదరు ఆసుపత్రికి వెళ్లాడు. ఆ సమయంలో ఫర్జానా వారితో కలిసి ఫొటోలు, వీడియోలు తీసుకుని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. ఈ క్రమంలో అజిత్‌ కరోనా బారిన పడ్డారంటూ ఆ ఫొటోలు వైరల్‌ అయ్యాయి. అజిత్‌తో సెల్ఫీ ఘటనలో ఆమె ఉద్యోగం ఊడిపోయింది. అయితే అజిత్‌ హాస్పిటల్‌ యాజమన్యంతో మాట్లాడితే తన ఉద్యోగం తిరిగి వస్తుందనే ఆశతో పలుమార్లు హీరోను కలిసేందుకు ప్రయత్నించింది, కానీ ఫలితం లేకపోయింది. ఈ నేపథ్యంలో తనకు న్యాయం చేయాలంటూ ఏకంగా హీరో ఇంటి ముందు ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఆమె ప్రయత్నాన్ని అడ్డుకున్న పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు