నేను తెలంగాణ బిడ్డనే.. వెలివేయకండి: పూనమ్‌ కౌర్‌ కంటతడి, వీడియో వైరల్‌

7 Mar, 2023 11:27 IST|Sakshi

హీరోయిన్‌ పూనమ్‌ కౌర్‌.. సినిమాల కంటే వివాదాలతో ఎక్కువ ఫేమస్‌ అయింది. మాయాజాలం సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత  ఒక విచిత్రం, నిక్కి అండ్ నీరజ్, ఆమె 3 దేవ్, శ్రీనివాస కళ్యాణం, నెక్స్ట్ ఏంటి తదితర చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. సినిమా విషయాలతో పాటు రాజకీయ అంశాలపై సోషల్‌ మీడియా వేదికగా స్పందిస్తూ.. తరచూ ట్రోలింగ్‌కు గురవుతుంటుంది. తాజాగా ఈ బ్యూటీ ఓ స్టేజీపై కన్నీళ్లు పెట్టుకుంది. తనను తెలంగాణ నుంచి వేరు చేస్తున్నారంటూ ఎమోషనల్‌ అయింది.

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ రాజ్‌ భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో పూనమ్‌ కౌర్‌ పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. తన మతం ద్వారా తనను వేరు చేసి చూస్తున్నారంటూ కన్నీళ్లు పెట్టుకుంది. ‘నేను తెలంగాణలోనే పుట్టాను. ఇక్కడే పెరిగాను. కానీ నేను పంజాబీని అని, సిక్కు అని మతం పేరుతో దూరం చేస్తున్నారు. నన్ను తెలంగాణ నుంచి దూరం చేయకండి. మతం పేరుతో నన్ను వెలివేయకండి. నేను తెలంగాణ బిడ్డనే’అంటూ పూనమ్‌ ఎమోషనల్‌ అయింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన  వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది.

మరిన్ని వార్తలు