నటుడిగా 12ఏళ్లుగా కష్టపడుతున్నా: సందీప్‌ కిషన్‌

26 Aug, 2021 08:41 IST|Sakshi

‘‘కొన్ని సినిమాలు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో విడుదలవుతున్నాయి. దానివల్ల డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్‌ ఇబ్బంది పడుతున్నారు. నిర్మాతగా అర్థం చేసుకోగలను. కానీ ‘వివాహ భోజనంబు’ను లాక్‌డౌన్‌ టైమ్‌లోనే ఓటీటీలో విడుదల చేయడానికి ఒప్పందాలు పూర్తయ్యాయి. అయితే నేను హీరోగా నటించిన ‘గల్లీ రౌడీ’ సినిమా మాత్రం థియేటర్స్‌లోనే వస్తుంది’’ అన్నారు సందీప్‌ కిషన్‌.

సత్య, ఆర్జావీ రాజ్‌ జంటగా రామ్‌ అబ్బరాజు దర్శకత్వంలో రామ్‌ ఆనంది ఆర్ట్స్, సోల్జర్స్‌ ఫ్యాక్టరీ, వెంకటాద్రి టాకీస్‌ సమర్పణలో కేఎస్‌ శినీష్, సందీప్‌ కిషన్‌ నిర్మించిన ‘వివాహ భోజనంబు’ సినిమా ఈ నెల 27 నుంచి సోనీ లివ్‌ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్‌ కానుంది. ఈ సందర్భంగా సందీప్‌ మాట్లాడుతూ – ‘‘కోవిడ్‌ టైమ్‌లో పెళ్లి చేసుకున్న ఓ పిసినారి యువకుడి ఇంట్లో అతని బంధువులు 16 మంది లాక్‌డౌన్‌ వల్ల ఉండిపోవాల్సి వస్తుంది.

వారిని పోషించేందుకు ఆ పిసినారి యువకుడు ఎలాంటి పనులు చేశాడనే అంశాలను ఆసక్తికరంగా తెరకెక్కించాడు దర్శకుడు. ఈ చిత్రంలో నేను అంబులెన్స్‌ డ్రైవర్‌ పాత్ర చేశాను’’ అన్నారు. ఇంకా మాట్లాడుతూ – ‘‘నటుడిగా 12 ఏళ్లుగా కష్టపడుతున్నాను. ఆ కష్టానికి తగ్గ ఫలితం ఇప్పుడు వస్తోంది. మంచి ప్రాజెక్ట్స్‌ కుదురుతున్నాయి. ‘ది ఫ్యామిలీమ్యాన్‌ 3’ సిరీస్‌లో, ఈస్ట్‌ కోస్ట్‌ ప్రొడక్షన్స్‌లో ఓ సినిమా, మరో మూడు ప్రాజెక్ట్స్‌ ఉన్నాయి’’ అన్నారు. 

చదవండి: 'కథ చెప్పడానికి ఫోన్‌ చేస్తే..మేనేజర్లకు చెప్పమన్నారు'
మహేశ్‌ బాబు బ్యాక్‌ టూ హైదరాబాద్‌

మరిన్ని వార్తలు