నేడే చూడండి టికెట్‌ కేవలం 50 రూపాయిలే

10 Nov, 2020 00:30 IST|Sakshi

కోవిడ్‌ వల్ల థియేటర్స్‌ వైపుకు రావట్లేదు ప్రేక్షకులు. వాళ్లందరూ మళ్లీ థియేటర్స్‌ బాట పట్టాలంటే ఏదో బలమైన ఆకర్షణ ఉండాలి. మంచి సినిమా ఉండాలి. బంఫర్‌ ఆఫర్‌ ఉండాలి. వీటన్నింటినీ కలిపి ఇవ్వడానికి ప్లాన్‌ సిద్ధం చేశాయి ప్రముఖ నిర్మాణ సంస్థ యశ్‌రాజ్‌ ఫిల్మ్స్,   పలు మల్టీప్లెక్స్‌ చైన్లు. ఆ విశేషాలు.

యశ్‌రాజ్‌ సంస్థ నిర్మాణంలోకి వచ్చి 50 ఏళ్లయింది. యాభై ఏళ్లుగా ఎన్నో విజయవంతమైన, సంచలనమైన సినిమాలను అందిస్తూ వస్తోంది. 50ఏళ్ల  ప్రయాణం సందర్భంగా పలు భారీ సినిమాలను నిర్మించడానికి ప్లాన్‌ చేస్తోంది. తాజాగా ఓ కొత్త ఆలోచనతో యశ్‌రాజ్‌ ముందుకు వచ్చింది. ఇన్నేళ్లుగా తమ సినిమాలను ఆదరించిన ప్రేక్షకులకు ఏదైనా ఇవ్వాలనుకుంది. తమ సూపర్‌ హిట్‌ సినిమాలను మళ్లీ ఆనందించేలా చేయాలనుకుంది.

కోవిడ్‌ వల్ల మర్చిపోయిన థియేట్రికల్‌ ఎక్స్‌పీరియన్స్‌ను తిరిగి రుచి చూపించాలనుకుంది. అది కూడా తక్కువ ధరకే. యశ్‌రాజ్‌ సంస్థ నిర్మించిన సూపర్‌ హిట్‌ సినిమాల్లో కొన్నింటిని దీపావళి సందర్భంగా మళ్లీ థియేటర్స్‌లో విడుదల చేయనున్నారు. నవంబర్‌ 12 నుంచి 19 వరకూ ఈ సినిమాలను పీవీఆర్, ఐనాక్స్, సినీపాలీస్‌ మల్టీప్లెక్స్‌లలో విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. టికెట్‌ ధర జస్ట్‌ 50 రూపాయిలే. మరి.. ప్రేక్షకులను తిరిగి థియేటర్స్‌కు తీసుకురావడానికి ఈ ప్రయత్నం ఎంత వరకూ సఫలం అవుతుందో చూడాలి.

రండీ.. ఆనందించండీ
‘సినిమా విడుదలకు మంచి సీజన్‌ దీపావళి. పండగకి సినిమాను ఆనందించడం సినీ ప్రేమికులకు ఇష్టమైన ఆనవాయితీ. యశ్‌రాజ్‌ సంస్థ ప్రేక్షకుల ఫేవరెట్‌ సినిమాలను మళ్లీ పెద్ద స్క్రీన్‌ మీద ఎంజాయ్‌ చేసే వీలు కల్పించడం చాలా సంతోషంగా ఉంది’’ అని పేర్కొన్నారు పీవీఆర్, ఐనాక్స్, సినీపాలీస్‌ మల్టీప్లెక్స్‌ ప్రతినిధులు.

ప్రదర్శితం కానున్న చిత్రాలు
యశ్‌రాజ్‌ నుంచి వచ్చిన చిత్రాల్లో ‘దిల్‌వాలే దుల్హనియా లేజాయేంగే’ ఓ క్లాసిక్‌. ఇటీవలే 25 ఏళ్లు పూర్తి చేసుకున్న ఈ సినిమాతో పాటు కభీ కభీ, సిల్సిలా, దిల్‌ తో పాగల్‌ హై, వీర్‌ జరా, బంటీ ఔర్‌ బబ్లీ, రబ్నే బనాదీ జోడీ, ఏక్‌థా టైగర్, బ్యాండ్‌ బాజా భారాత్, సుల్తాన్, వార్, మర్దానీ చిత్రాలు మళ్లీ విడుదల కానున్నాయి.

మరిన్ని వార్తలు