ఆదిత్యుని సన్నిధిలో వర్ధమాన హీరో పూరి ఆకాష్
సాక్షి, అరసవల్లి: ‘నా కేరాఫ్ అడ్రస్ నాన్నే... నన్ను బాల నటుడిగా స్క్రీన్ మీద చూసుకున్న నాన్న .. ఇప్పుడు హీరోను చేశారు. అందుకు తగిన శిక్షణ కూడా ఆయనే ఇచ్చారు...ఆయన స్ఫూర్తితోనే అతని అడుగుజాడల్లోనే ఉత్తమ హీరో అనిపించుకోవాలనేది నా ఆశ..’ అంటూ ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాష్ తెలిపారు. ఆదివారం తన కుటుంబసభ్యులతో కలిసి ఆదిత్యుని ఆలయానికి వచ్చిన యువ హీరో.. మీడియాతో కాసేపు ముచ్చటించారు. అంతకుముందు నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ తనయులతో కలిసి ఆదిత్యునికి ప్రత్యేక పూజలు చేశారు.
ఆదిత్యుని చిత్రపటాన్ని హీరో ఆకాష్కు అందజేస్తున్న ఈఓ
అనంతరం విలేకరులతో మాట్లాడుతూ సినిమా అంటే తనకు పిచ్చి అని, అందుకు నాన్న కూడా ప్రోత్సహిస్తున్నారని తెలిపారు. ఇప్పటికే ఆంధ్రాపోరి, మెహబూబా తదితర చిత్రాల్లో హీరోగా నటించానని, తాజాగా రొమాంటిక్ అనే సినిమా రిలీజ్కు సిద్ధంగా ఉందని తెలిపారు. లవ్ అండ్ యాక్షన్ మూవీస్పైనే తన దృష్టి ఉందని, మాస్ సినిమాలకు కూడా ప్రిపేరవుతున్నానని చెప్పారు. ఆదిత్యుని దర్శనం తొలిసారిగా చేసుకున్నానని ఎంతో ఆనందంగా ఉందన్నారు. అనంతరం ఆదిత్యుని చిత్రపటాన్ని ఆలయ ఈఓ వి.హరిసూర్యప్రకాష్ ఆయనకు అందజేశారు.