Siddharth: సిద్దార్థ్‌ చనిపోయాడంటూ వీడియో వైరల్‌, స్పందించిన హీరో

19 Jul, 2021 15:40 IST|Sakshi

వ్యూస్‌ కోసం, ఆదాయం కోసం యూట్యూబ్‌లో ఫేక్‌ వీడియోలు చేస్తుంటారు చాలామంది. ఈ క్రమంలో సెలబ్రిటీలను టార్గెట్‌ చేస్తుంటారు. బతికుండగానే చనిపోయారంటూ కథనాలు అల్లేస్తారు. ఇలాంటి వీడియోల మీద ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా మళ్లీ ఇలాంటివి ఏదో ఒక ఫేక్‌ వీడియోలు కొత్తగా పుట్టుకొస్తూనే ఉంటాయి. ఇకపోతే 'యుక్తవయసులో చనిపోయిన 10 మంది  సౌత్‌ ఇండియన్‌ సెలబ్రిటీలు' అని రాసున్న యూట్యూబ్‌ వీడియో లింక్‌ను ఓ నెటిజన్‌ ట్విటర్‌లో షేర్‌ చేశాడు.

ఇందులో వీడియో థంబ్‌నైల్‌పై హీరోయిన్స్‌ సౌందర్య, ఆర్తి అగర్వాల్‌తో పాటు హీరో సిద్దార్థ్‌ ఫొటో కూడా ఉంది. ఇది చూసిన సదరు నెటిజన్‌ ఇదేం అరాచకం అని ప్రశ్నించాడు. వ్యూస్‌ కోసం ఏమైనా చేస్తారా? అని అసహనం వ్యక్తం చేశాడు. ఈ ట్వీట్‌ కాస్తా సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడమే కాక హీరో సిద్దార్థ్‌ కంట పడింది. దీనిపై అతడు స్పందిస్తూ.. 'నేను బతికుండగానే చనిపోయానని పేర్కొన్న ఈ వీడియోపై కొన్నేళ్ల క్రితమే రిపోర్ట్‌ చేశాను. కానీ వాళ్లు ఏమని రిప్లై ఇచ్చారో తెలుసా? సారీ, ఈ వీడియో వల్ల ఎలాంటి సమస్య లేదు అని! వీరి రియాక్షన్‌ చూసి ఓరీ దుర్మార్గుల్లారా.. అని మనసులోనే తిట్టుకున్నాను' అని చెప్పుకొచ్చాడు.

కాగా సిద్దార్థ్‌ సుమారు ఎనిమిదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత టాలీవుడ్‌లోకి తిరిగి ఎంట్రీ ఇస్తున్నాడు. అతడు తెలుగులో ప్రధాన పాత్రలో నటిస్తోన్న 'మహా సముద్రం' ఇటీవలే షూటింగ్‌ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం అతడి చేతిలో 'సైతాన్‌ కా బచ్చా', 'ఇండియన్‌ 2' సినిమాలున్నాయి.

మరిన్ని వార్తలు