చట్టపరంగా ముందుకెళ్తా: యూట్యూబర్‌ రషీద్‌ సిద్దిఖీ

21 Nov, 2020 20:45 IST|Sakshi

ముంబై: బాలీవుడ్‌ స్టార్‌ అక్షయ్‌కుమార్‌ జారీ చేసిన పరువు నష్టం నోటీసులు తీసుకునేందుకు బిహార్‌కు చెందిన యూట్యూబర్‌ రషీద్‌ సిద్దిఖీ నిరాకరించాడు. బాలీవుడ్‌ యువ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య విషయంలో రషీద్ య్యూట్యూబ్‌లో తనపై తప్పుడు ఆరోపణలు చేశాడని అ​క్షయ్‌ తన నోటీసుల్లో పేర్కొన్నాడు. తన పరువుకు భంగం కలిగించినందుకు రూ.500 కోట్లు చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ నవంబర్‌ 17న వీటిని పంపించారు. సుశాంత్‌ సింగ్‌ ఆత్మహత్యకు సంబంధించి ఎ‍ఫ్‌ఎఫ్‌ న్యూస్‌ చానెల్‌లో ఎలాంటి ఆధారాలు లేకుండా, అవమానకరమైన రీతిలో తనపై తప్పుడు ప్రచారం చేశాడని అ​క్షయ్‌ ఆరోపించాడు. 

అయితే అక్షయ్‌ తనకు పంపించిన నోటీసులు వెనక్కు తీసుకోవాలని, లేదంటే అతనిపై చట్టపరంగా ముందుకెళ్తానని  సిద్దిఖీ అన్నారు. ఈ మేరుకు ఆయన తన న్యాయవాది జేపీ జైస్వాల్‌ ద్వారా శుక్రవారం నోటీసులు పంపించారు. అక్షయ్‌ కుమార్‌ నోటీసుల పేరుతో తనపై వేధింపులకు దిగుతున్నాడని అందులో ఆరోపించాడు. తమ అభిప్రాయాలను వెల్లడించే స్వేచ్ఛ ప్రతీ పౌరుడికి ఉంటుందని, ప్రాథమిక హక్కుల్లో ఇది భాగమని  సిద్దిఖీ స్పష్టం చేశారు. తన చానెల్‌లో వచ్చిన వీడియోలు పరువు నష్టం కిందకి రావని తెలిపారు. ఇతర న్యూస్‌ చానెళ్లలో వచ్చిన సమాచారం ఆధారంగానే తాను అక్షయ్‌పై వార్తలు ప్రసారం చేశానని పేర్కొన్నాడు. తాను ఆ వీడియోలను ఆగస్టులో ప్రసారం చేశానని.. అయితే ఇప్పటి వరుకు ఎందుకు స్నందించలేదో అక్షయ్‌సమాధానం చెప్పాలన్నారు. కావాలనే తనపై కక్ష్య సాధింపు చర్యలకు దిగాడని సిద్దిఖీ ఆరోపించారు.

మహారాష్ట్ర పోలీసులతో పాటు ప్రభుత్వంపై ఉద్ధేశపూర్వకంగా తన యూట్యూబ్‌ చానెల్‌లో అసత్య ప్రచారం చేశాడనే ఆరోపణలతో ముంబై పోలీసులు సిద్ధిఖీపై కేసు నమోదు చేశారు. తనను అరెస్టు చేయకుండా నవంబర్‌ 3న సిద్దిఖీ ముందస్తు బెయిల్‌ పొందిన విషయం తెలిసిందే.
 

మరిన్ని వార్తలు