ములుగు రూరల్( గోవిందరావుపేట): వడగళ్ల వర్షానికి పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. గోవిందరావుపేట మండల పరిధిలోని పలు మామిడి తోటలు, వరి పంటను బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుండ్లవాగు శివారులో మామిడి, వరి, మిర్చి పంటలు పూర్తిగా ధ్వంసమయ్యాయన్నారు. చేతికి వచ్చిన పంటలు అకాల వర్షాలకు నేలమట్టం కావడంతో రైతన్నలు కన్నీటి పర్యంతమవుతున్నారని తెలిపారు. వ్యవసాయం, హార్టికల్చర్ అధికారులు సర్వే నిర్వహించి పంటనష్టం అంచనా వేసి ప్రభుత్వానికి నివేదికలు పంపాలన్నారు. లేని పక్షంలో రైతులను సమీకరించి ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి తీగల ఆదిరెడ్డి, పొదిళ్ల చిట్టిబాబు, గుండు రామస్వామి, సామ చంద్రారెడ్డి, భూక్య మిట్ నాయక్, పాలిత్య బాలు, మూడు రాజునాయక్, మాలోత్ గాంధీ, అజ్మీర కొమ్మాలు, అజ్మీర దుర్గ, భూక్య మార్క్ తదితరులు పాల్గొన్నారు.