ములుగు: రాహుల్ గాంధీ విషయంలో కక్ష పూరితంగా వ్యవహరిస్తున్న బీజేపీ ప్రభుత్వ తీరుకు నిరసనగా నేడు (శనివారం) మండలకేంద్రాల్లో నిర్వహించనున్న ధర్నా, దీక్ష కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఏఐసీసీ మహిళా ప్రధానకార్యదర్శి, ఎమ్మెల్యే డాక్టర్ ధనసరి సీతక్క పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలో శుక్రవారం మాట్లాడుతూ మోదీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న కారణంగా అనర్హత వేటు వేశారన్నారు. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రశ్నించే గొంతును ఆపలేరన్నారు. రాహుల్ గాంధీ బలహీన వర్గాలకు వ్యతిరేకమని ముద్రవేయడం దారుణమన్నారు. టీపీసీసీ కార్యదర్శి పైడాకుల అశోక్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇర్సవడ్ల వెంకన్న, కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు గొల్లపల్లి రాజేందర్గౌడ్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బానోత్ రవిచందర్, మండల అధ్యక్షుడు ఎండీ చాంద్పాషా, చింతనిప్పుల భిక్షపతి, అలోత్ దేవ్సింగ్ పాల్గొన్నారు.
మోదీ, అదానీ ఆస్తులపై విచారణ జరపండి
కాళేశ్వరం: దేశ ప్రజల కోసం తన గొంతుకై ప్రజల పక్షాన పోరాటం చేస్తున్న రాహుల్గాంధీపైన కేసులు, బెదిరింపులు కక్షపూరితమైన చర్యలు మానుకోవాలని మోదీ ప్రభుత్వాన్ని ములుగు ఎమ్మెల్యే సీతక్క హెచ్చరించారు. శుక్రవారం ఆమె మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో విలేకర్లతో మాట్లాడారు. దేశం కోసం ఇందిరాగాంధీ, రాజీవ్గాంధీలు ప్రాణత్యాగాలు చేశారని, స్వాతంత్య్రం కోసం స్వంత ఆస్తులు దారపోశారన్నారు. రాహుల్గాంధీపైన మోదీ ప్రభుత్వం కుట్రలు చేస్తుందని ఆగ్రహం వ్యక్తంచేశారు. వాటన్నింటికీ భయపడేది లేదని అన్నారు. దేశంలో లక్షల కోట్లు దోచుకుంటున్న మోదీ, అదానీల పైన పార్లమెంట్లో జాయింట్ కమిటీ వేసి, ఈడీ, సీబీఐ, సిట్ విచారణలు జరిపించాలని డిమాండ్ చేశారు. రాహుల్పై చేస్తున్న కుట్రలను తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు. ఆమె వెంట కాంగ్రెస్పార్టీ నాయకులు పాల్గొన్నారు.
నల్లెల అస్థికల నిమజ్జనం
కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షుడు నల్లెల కుమారస్వామి ఇటీవల మృతి చెందగా శుక్రవారం కాళేశ్వరంలోని త్రివేణి సంగమ గోదావరిలో అస్థికలు నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో ములుగు ఎమ్మెల్యే సీతక్క పాల్గొని కుటుంబ సభ్యులను సంతాపం తెలిపారు. ఆమె వెంట టీపీసీసీ కార్యదర్శి పైడాకుల అశోక్, కిసాన్కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు బానోత్ రవిచందర్, బ్లాక్కాంగ్రెస్ అధ్యక్షుడు ఇర్స వెంకన్న, మండల అధ్యక్షుడు చాంద్పాష, ఎంపీటీసీ తిరుపతి, నాయకులు పాల్గొన్నారు.