ఆళ్లగడ్డ: వేద పండితుల వేద మంత్రోచ్ఛారణలు హోరెత్తగా.. భక్తుల గోవింద నామస్మరణ మారుమోగగా.. అహోబిలేశుడి కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎగువ అహోబిలంలో ప్రధాన ఘట్టమైన శ్రీ జ్వాలా నరసింహస్వామి, చెంచులక్ష్మి అమ్మవార్ల తిరు కల్యాణోత్సవం కనులపండవగా సాగింది. ముందుగా అహోబిలం మఠం పీఠాధిపతి శ్రీమన్ శఠకోప రంగనాథ యతీంద్ర మహాదేశికన్ ఆధ్వర్యంలో స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు శాస్త్రోక్తంగా ఎదురుకోళ్ల కార్యక్రమం నిర్వహించారు. అనంతరం మంగళవాయిద్యాలతో ఊరేగింపుగా కల్యాణ మండపానికి తోడ్కొని వచ్చి కొలువుంచి స్వామి, అమ్మవారికి కంకణధారణ నిర్వహించారు. అనంతరం భక్తుల గోవింద నామస్మరణ మధ్య మాంగళ్యధారణ జరిగింది. చివరగా స్వామి, అమ్మవార్ల పాదాల వద్ద ముత్యాల తలంబ్రాలు పోసి కల్యాణ మహోత్సవాన్ని ముగించారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వాముల కల్యాణం కనులారా తిలకించిన భక్తులు పరవశించిపోయారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడో రోజు శనివారం దిగువ అహోబిలంలో శ్రీ ప్రహ్లాద వరదస్వామి వేణుగోపాల స్వామి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రి పొన్నచెట్టు వాహనంపై విహరించారు.
వైభవంగా జ్వాల
నరసింహుడి కల్యాణం
తరలివచ్చిన భక్తజనం