నంద్యాల: పట్టభద్ర, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్లో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ మనజీర్ జిలానీ శామూన్ పేర్కొన్నారు. సోమవారం కలెక్టర్ చాంబర్లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో చేయదగినవి, చేయకూడనవి సూచనలపై ముద్రించిన వాల్ పోస్టర్, స్టిక్కర్లను కలెక్టర్ అధికారులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో శాసన మండలి ఎన్నికల్లో గ్రాడ్యుయేట్లు, టీచర్లు ఓటు వేసే విధానంపై స్వీప్ కార్యక్రమం ద్వారా సంపూర్ణ అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. జిల్లాలోని 94 పోలింగ్ కేంద్రాలు, అన్ని గ్రామ, వార్డు సచివాలయాల్లో స్టిక్కర్, పోస్టర్లను ప్రదర్శించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి పుల్లయ్య, ఐసీడీఎస్ పీడీ లీలావతి, కమాండ్ కంట్రోల్ రూం సూపరింటెండెంట్ నాగమణి తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ మనజీర్ జిలానీ శామూన్