కర్నూలు సిటీ: జిల్లాలోని 26 కస్తూర్బా గాంధీ విద్యాలయాల్లో 6వ తరగతి, ఇంటర్మీడియట్ ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ చేసినట్లు సమగ్ర శిక్ష అదనపు కో–ఆర్డినేటర్ డాక్టర్ కె.వేణుగోపాల్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. కేజీబీవీల్లో 6, ఇంటర్ మొదటి సంవత్సరానికి 40 సీట్ల చొప్పున, 7, 8, 9 తరగతుల్లో మిగిలిన సీట్లకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. అనాథ పిల్లలు, బడి బయట పిల్లలు, డ్రాపౌట్స్, పేద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, బీపీఎల్ బాలికలు మాత్రమే దరఖాస్తుకు అర్హులన్నారు. ముస్లిం, మైనార్టీ విద్యార్థులకు ప్రత్యేకంగా కల్లూరు, ఆదోనిలలో రెండు కేజీబీవీలు ఉన్నాయని, వీటిలో పేద ముస్లిం విద్యార్థినిలకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. ఈ నెల 27 నుంచి వచ్చే నెల 20వ తేది వరకు apkgbv.apcfss.in అనే వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. పూర్తి వివరాలకు సమీపంలోని కేజీబీవీల ప్రిన్సిపాళ్లు, జీసీడీఓ 9000204936ను సంప్రదించవచ్చని పేర్కొన్నారు.