● మహాసరస్వతి అలంకారంలో కటాక్షించిన భ్రామరి ● సంప్రదాయబద్ధంగా వీరాచార విన్యాసాలు ● నేడు స్వామిఅమ్మవార్ల రథోత్సవం

22 Mar, 2023 02:30 IST|Sakshi

భక్తజన సందోహం నడుమ స్వామి,అమ్మవార్ల ప్రభోత్సవం

చదువుల తల్లీ నమోస్తుతే..

ఉగాది మహోత్సవాల్లో భాగంగా మూడవ రోజు భ్రమరాంబాదేవి మహాసరస్వతి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. చతుర్భుజాలు కలిగి ఉండి వీణ, అక్షరమాల పుస్తకాన్ని ధరించిన ఈ దేవిని దర్శించడం వలన విద్యాప్రాప్తితో పాటు అభీష్టాలు సిద్ధిస్తాయని పండితులు చెబుతున్నారు. అలాగే నందివాహనాధీశులైన శ్రీస్వామి అమ్మవార్లను దర్శించడంతో చేపట్టే పనుల్లో విజయం లభిస్తుందని, భోగభాగ్యాలు కలుగుతాయని భక్తుల నమ్మకం.

శ్రీశైలంటెంపుల్‌: ఇల కైలాసమైన శ్రీగిరి క్షేత్రంలో ఉగాది మహోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో పాల్గొనేందుకు కర్ణాటక, మహారాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు శ్రీగిరి చేరుకున్నారు. దీంతో శ్రీశైల క్షేత్రం కన్నడ భక్తులతో కిక్కిరిసిపోయింది. ఉత్సవాల్లో మూడోరోజు మంగళవారం శ్రీ భ్రమరాంబాదేవి మహాసరస్వతి అలంకారంలో భక్తులకు కటాక్షించారు. శ్రీభ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామి నందివాహనంపై అదిష్టించి భక్తులకు దర్శనమిచ్చారు. స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులకు నిర్వహించిన ప్రభోత్సవం నేత్రానందభరితంగా సాగింది. ముందుగా స్వామి అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీభ్రమరాంబాదేవిని మహాసరస్వతి అలంకారంలో ప్రత్యేకంగా అలంకరించి విశేష అలంకార పూజలు చేపట్టారు. ఆతర్వాత ఉభయ దేవాలయ ప్రాంగణంలోని అలంకార మండపంలో స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులకు నందివాహనసేవ పూజలు చేపట్టి ఆలయ ఉత్సవాన్ని నిర్వహించారు. క్షేత్ర ప్రధాన వీధుల్లో నిర్వహించిన గ్రామోత్సవం కనులపండువగా సాగింది. కర్ణాటక జాంజ్‌, వీరగాసీ, కన్నడ జానపదడోలు, కోలాటం, చెక్కభజన, పగటి వేషాల ప్రదర్శన, బుట్టబొమ్మలు, గొరవయ్యల నృత్యం, తప్పెట్లు, కొమ్మువాయిద్యాలు, నందికోలు నృత్యాలు గ్రామోత్సవానికి మరింత వన్నెను తీసుకువచ్చాయి. పూజా కార్యక్రమాల్లో దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎస్‌.లవన్న దంపతులు, ఏఈవోలు హరిదాసు, అర్చకులు, వేదపండితులు, అధికారులు పాల్గొన్నారు.

నేత్రానందభరితంగా ప్రభోత్సవం..

ఉగాది మహోత్సవాల్లో భాగంగా మూడోరోజు స్వామిఅమ్మవార్లకు ప్రభోత్సవం నిర్వహించారు. గంగాధర మండపం వద్ద వివిధ పుష్పాలతో అలంకరించిన ప్రభపై ఉత్సవమూర్తులను చేర్చి ప్రభోత్సవం నిర్వహించారు. గంగాధర మండపం నుంచి నందిమండపం వరకు వేలాది మంది కన్నడ భక్తుల నీరాజనాల నడుమ ప్రభోత్సవం కన్నుల పండువగా సాగింది.

నేడు పంచాంగ శ్రవణం..

వీరాచార విన్యాసాలు..

అమావాస్య ఘడియలను పురస్కరించుకుని కర్ణాటక వీర శైవ భక్తులు అగ్నిగుండప్రవేశం, వీరాచార విన్యాసాల కార్యక్రమాన్ని నిర్వహించారు. శివదీక్షా శిబిరాల వద్ద కార్యక్రమం కోసం దేవస్థానం విస్తృత ఏర్పాట్లు చేసింది. పోలీసు శాఖ ఆధ్వర్యంలో గట్టి బందోబస్త్‌ ఏర్పాటు చేశారు. వీరాచార సంప్రదాయాన్ని అనుసరించి జరిపే ఈ కార్యక్రమానికి ఎంతో విశిష్టత ఉంది. కర్ణాటకకు చెందిన వీరశైవ భక్తులు వీరభద్రవచనాలను పఠిస్తూ శూలాలు, తదితర అస్త్రాలను తమ చెంపల్లోకి, నాలుకలలోకి, పెదవుల్లోకి, కడుపులోకి, చేతులకు గుచ్చుకున్నారు. ప్రత్యేక వేషదారణలో వివిధ రకాల వాయిద్యాల నడుమ వారు చేసే ఈ విన్యాసాలతో భక్తులను గగురుపాటుకు గురయ్యారు.

ఉత్సవాల్లో భాగంగా నాల్గవరోజు బుధవారం ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఉదయం 10.30 గంటలకు దేవస్థాన అస్థాన సిద్ధాంతి పండిత బుట్టే వీరభద్ర దైవజ్ఞచే పంచాంగ శ్రవణం కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. అలాగే సాయంత్రం స్వామిఅమ్మవార్లకు రథాంగహోమం, రథాంగపూజ, రథాంగ బలిహరణలు చేపట్టిన అనంతరం రథోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.

మరిన్ని వార్తలు