తెలంగాణ ప్రగతి దేశానికే ఆదర్శం

22 Mar, 2023 01:36 IST|Sakshi

నారాయణపేట: సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో తెలంగాణ సాధించిన ప్రగతి దేశానికి ఆదర్శంగా నిలిచిందని బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఎస్‌.రాజేందర్‌రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ నారాయణపేట నియోజకవర్గ, జిల్లా ప్రజలకు శోభకృత్‌ నామ సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. వ్యవసాయ సంవత్సరంగా పరిగణించే ఉగాది, రైతులకు ప్రజలకు అన్నిరంగాల్లో శుభాలను చేకూర్చాలని ఆకాంక్షించారు. సాగునీరు, తాగునీరు, పచ్చని పంటలతో తెలంగాణలో నిత్యవసంతం నెలకొన్నదన్నారు. వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడం ద్వారా అనుబంధ రంగాలు, వృత్తులు బలపడి తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టమైందన్నారు. శోభకృత్‌ నామ సంవత్సరంలో తెలంగాణతో పాటు భారతదేశం గొప్పగా అభివృద్ధి సాధించాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.

రేపు ఇంటర్వ్యూలు

మద్దూరు: మైనార్టీ కార్పొరేషన్‌ ద్వారా 2022–23 ఆర్థిక సంవత్సరానికి సంబందించి రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈనెల 23న ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం 2గంటలకు మండల పరిషత్‌ కార్యాలయంలో నిర్వహిస్తున్నట్లు ఎంపీడీఓ విజయలక్ష్మి మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. దరఖాస్తుదారులు సంబంధిత పత్రాలతో హాజరుకావాలని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు