నారాయణపేట రూరల్/ధన్వాడ: రేషన్ కార్డు లబ్ధి దారులు సరుకులు ఎక్కడైనా తీసుకోవచ్చని కలెక్టర్ శ్రీహర్ష అన్నారు. శుక్రవారం నారాయణపేట, ధన్వాడ మండల్లాలోని రేషన్ దుకాణాలను ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రేషన్ షాపులో ఎంత స్టాక్ ఉంది, వాటి వివరాలను రిజిస్టర్లో పరిశీలించారు. ప్రతి ఒక్క లబ్ధిదారులకు సరుకులు అందజేయాలన్నారు. కార్డు కల్గిన వారు ఎక్కడైన సరుకులు పొందవచ్చని, వారిపై నిర్లక్ష్యంగా వ్యవహరించినా, సరుకులు అక్రమంగా తరలించినా డీలర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం ధన్వాడ పీహెచ్సీకి చేరుకొని సిబ్బంది అటెండెన్స్ రిజిస్టర్ను పరిశీలించారు. రోగులకు అందుబాటులో ఉంటూ మెరుగైన వైద్యం అందించాలని అన్నారు. కలెక్టర్ వెంట అధికారులు శివప్రసాద్, డీటీ కలప్ప తదితరులు ఉన్నారు.
ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక వేగవంతం
నారాయణపేట రూరల్: జిల్లాలో అర్హులైన డబుల్ బెడ్రూం ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ఏప్రిల్లోగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతకుమారి పేర్కొన్నారు. శుక్రవారం వారు నిర్వహించిన వీసీలో కలెక్టర్ శ్రీహర్షతో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. కంటి వెలుగు, వేసవి దృష్ట్యా అగ్నిప్రమాదాల నివారణ చర్యలు, ఇంటర్మీడియట్, పదో తరగతి పరీక్షలు తదితర వాటిపై చర్చించారు.