నారాయణపేట: ఏప్రిల్ 5 నుంచి 8వ తేదీ వరకు నిర్వహించనున్న గిరిజనుల ఆధ్యాత్మిక గురువు శ్రీ కామసందు బాపూజీ ఉత్సవాలను ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఘనంగా నిర్వహించుకునే విధంగా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా పూర్తి చేయాలని అధికారులను కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. మంగళవారం కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డితో కలసి మద్దూర్ మండలం తిమ్మారెడ్డిపల్లి బాపూజీ జాతర ఏర్పాట్లపై అధికారులతో కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు. తాగునీరు, విద్యుత్ సౌకర్యం, ప్రత్యేక బస్సులు, పోలీసు బందోబస్తు, మొబైల్ టాయిలెట్లు వంటివి ఏర్పాటు చేయాలని ఆదేశించారు. జిల్లాలోనే అతిపెద్ద జాతర అని, దేశ నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేస్తారని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. అనంతరం జాతర వాల్పోస్టర్ విడుదల చేశారు. కార్యక్రమంలో కోస్గి జెడ్పీటీసీ జయప్రకాశ్రెడ్డి, ఆర్డీఓ రాంచందర్నాయక్, డీఆర్డీఓ గోపాల్ నాయక్, జిల్లా అధికారులు మురళి, ఆలయ కమిటీ సభ్యులు గోపాల్ తదితరులు పాల్గొన్నారు.
మన బడి పనులపై సమీక్ష
మన ఊరు– మన బడి పనులను త్వరగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. మద్దూర్ మండల గ్రామ సర్పంచ్, అధికారులు, కలెక్టర్ శ్రీహర్షతో కలిసి మన బడి పనులపై సమీక్ష నిర్వహించారు. మద్దూర్ మండలంలో ఎంపిక చేసిన 28 పాఠశాలలు ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయన్నారు. కొన్ని చోట్ల ప్రహరీలు, మరుగుదొడ్లు, కిచెన్ షెడ్ల నిర్మాణ పనుల్లో జాప్యం వహించడంతో పనులు అసంపూర్తిగా ఉన్నాయని, వాటిని వెంటనే పూర్తి చేయాలన్నారు. ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కలెక్టర్ లేదా తన దృష్టికి తేవాలని చెప్పారు. ఏప్రిల్ చివరికల్లా పాఠశాలలు ప్రారంభం చేసుకునేలా చూడాలని చెప్పారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న పాఠశాలలకు ఫర్నీచర్ను తరలిస్తామన్నారు.