కలెక్టరేట్‌ వద్ద కుటుంబం ఆత్మహత్యాయత్నం

13 Apr, 2021 11:04 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

కిరోసిన్‌ పోసుకుని గర్భిణి సహా ఒకే కుటుంబానికి చెందిన 10 మంది

హత్య కేసులో నిందితులను అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌

నెల్‌లై కలెక్టరేట్‌లో కలకలం

సాక్షి, టీ.నగర్‌: నెల్‌లై కలెక్టరేట్‌లో ఒకే కుటుంబానికి చెందిన పదిమంది సోమవారం ఆత్మహత్యకు యత్నించడం సంచలనం కలిగించింది. నెల్‌లై తచ్చనల్లూరు సత్రంపుదుకుళం థాట్కో కాలనీకి చెందిన పెరుమాళ్‌ కుమారుడు అజిత్‌ లా కోర్సు చదువుతున్నాడు. ఇతను గత ఫిబ్రవరి 12న మానూర్‌ సమీపాన ఉన్న నరియూత్తు నుంచి అభిషేకపట్టి వెళ్లే అటవీమార్గం ముళ్లపొదల్లో శవమై తేలాడు. స్థలానికి సంబంధించి పాతకక్షల నేపథ్యంలోనే అతడు దారుణ హత్యకు గురైనట్లు తేలింది. దీనిపై మానూరు పోలీసులు కేసు నమోదు చేశారు.

అయితే ఈ కేసులో నిందితులను అరెస్ట్‌ చేయకుండా పోలీసులు‌ సహకరిస్తున్నారని ఆరోపిస్తూ గర్భవతి అయిన హతుని భార్య, తండ్రి పెరుమాళ్, సోదరుడు అరుళ్, అతని తల్లితో సహా కుటుంబీకులు, బంధువులు సోమవారం నెల్‌లై కలెక్టర్‌ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. అంతేకాకుండా తమ వెంట తెచ్చుకున్న కిరోసిన్‌ ఒంటిపై పోసుకుని నిప్పంటించుకునేందుకు యత్నించారు. అప్రమత్తమైన అక్కడి పోలీసులు వారి నుంచి కిరోసిన్‌ బాటిల్‌ స్వాధీనం చేసుకున్నారు. ఈ ఉదంతం కలకలం రేపింది. పోలీసులు వారితో చర్చించారు. కలెక్టర్‌కు వారు కలిసి వినతి పత్రం ఇచ్చేందుకు చర్యలు తీసుకున్నారు.

చదవండి: మరదలిపై అనుమానం.. చంపి, శవాన్ని..

మరిన్ని వార్తలు