కరోనా విలయం: కోటి ఉద్యోగాలు గల్లంతు

1 Jun, 2021 13:00 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ రెండో దశలో దేశాన్ని అతలాకుతలం చేసింది. రికార్డు  స్థాయిలో రోజుకు 4 లక్షలకుపైగా కేసులు నమోదైన తరుణంలోఅనేక రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ విధించక తప్పని పరిస్థితి నెలకొంది. కరోనా సెకండ్‌ వేవ్‌ సృష్టించిన విలయంతో అనేక కుటుంబాలు  చితికిపోవడే కాదు దేశ ఆర్థిక వ్యవస్థ కూడా చిన్నాభిన్నమైంది.  లక్షలాది మంది ఉపాధి కోల్పోయారు. ఈ నేపథ్యంలో సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) కీలక అంచనాలను వెలువరించింది.   కరోనా రెండో దశలో ఉధృతి కారణంగా  కోటి మంది ఉద్యోగాలు కోల్పోయారనీ, గృహాల ఆదాయం 97 శాతం క్షీణించిందని తెలిపింది.

కోవిడ్-19 సెకండ్‌ వేవ్‌లో భారీగా ఉద్యోగ నష్టం జరిగిందని సీఎంఐఈ సీఈఓ మహేష్ వ్యాస్ తెలిపారు. సుమారు10 మిలియన్ల మంది ఉద్యోగాలు కోల్పోయారని వెల్లడించారు. గత సంవత్సరం మహమ్మారి ప్రారంభ మైనప్పటి నుంచి 97 శాతం గృహ ఆదాయం క్షీణించిందని, ఏప్రిల్‌లో ఇది 8 శాతంగా ఉన్న నిరుద్యోగిత రేటు మే నెలాఖరులో 12 శాతంగా నమోదు కావొచ్చన్నారు. అయితే లాక్‌డౌన్ల ఆంక్షల సడలింపు, వ్యాపార కార్యకాలాపాల ప్రారంభతరువాత ఆర్థిక పరిస్థతి బాగుపడుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.  కానీ ఉద్యోగాలు కోల్పోయిన వారు తిరిగి ఉపాధి పొందడం కష్టమేన్నారు.  ముఖ్యంగా అసంఘటిత రంగ ఉద్యోగాలు త్వరగానే తిరిగొచ్చినా, సంఘటిత, నాణ్యమైన ఉద్యోగ అవకాశాలు తిరిగి రావడానికి ఒక సంవత్సర కాలం పడుతుందన్నారు. 

గత ఏడాదికాలంలో ఆదాయాల తీరుపై 1.75 లక్షల గృహాలపై సీఎంఐఈ ఏప్రిల్‌లో దేశవ్యాప్త సర్వే పూర్తి చేసిందని వ్యాస్ చెప్పారు. ఈ  కాలంలో కేవలం 3 శాతం మంది ఆదాయాలు మాత్రమే పెరిగాయని, కోవిడ్‌ వేవ్స్‌ కారణంగా దాదాపు 55 శాతం మంది ఆదాయాలు ప్రభావితమయ్యాయన్నారు.  ఇక 42 శాతం మంది తమ ఆదాయాలు అంతకుముందు ఏడాది మాదిరిగానే ఉన్నాయని చెప్పారు.  కరోనాత దేశంలో 97 శాతం కుటుంబాల ఆదాయాలు క్షీణించాయని, జాతీయ లాక్‌డౌన్ కారణంగా నిరుద్యోగిత రేటు 2020 మేలో రికార్డు స్థాయిలో 23.5 శాతానికి చేరుకుందన్నారు.  అలాగే మహమ్మారి ముందు కాలంలో 42.5 శాతంగా కార్మిక భాగస్వామ్య రేటు ప్రస్తుతం 40 శాతానికి తగ్గిందని ఆయ పేర్కొన్నారు.

చదవండి : Mamata Banerjee: బెంగాల్‌లో బీజేపీకి మరో షాక్‌! 
Petrol, Diesel Prices: వరుసగా రెండో రోజూ బాదుడు

మరిన్ని వార్తలు