రెండు రాష్ట్రాల తీరాల్లో 10 మృతదేహాలు 

24 May, 2021 11:47 IST|Sakshi

ముంబై/వల్సద్‌: టౌటే తుఫాను తీరం దాటుతున్న సమయంలో అరేబియా సముద్రంలో ఉన్న పీ– 305 బార్జ్‌ మునిగిపోయిన సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటనలో గల్లంతైన వారివిగా భావిస్తున్న 10 మృతదేహాలు మహారాష్ట్ర, గుజరాత్‌లలోని పలు తీరాలకు కొట్టుకొచ్చాయి. మృతదేహాలపై ఉన్న దుస్తులు, లైఫ్‌ జాకెట్లను బట్టి వారిని పీ– 305 బార్జ్‌కు చెందిన వారిగా భావిస్తున్నామని పోలీసులు ఆదివారం వెల్లడించారు.

అయితే ఆ వ్యక్తులు ఎవరన్న దానిపై విచారణ సాగుతోందని చెప్పారు. మహారాష్ట్రలోని రాయగఢ్‌ జిల్లాలో దొరికిన మృతదేహాల్లో మాండ్వా తీరంలో అయిదు, అలీబౌగ్‌లో రెండు, మురుద్‌లో ఒకటి ఉన్నాయని చెప్పారు. మరోవైపు గుజరాత్‌లోని వల్సద్‌ జిల్లాలో ఆదివారం రెండు మృతదేహాలు కనిపించాయి. శనివారం నుంచి మొత్తం ఆరు మృతదేహాలు దొరికినట్లు అక్కడి పోలీసులు తెలిపారు. మొత్తం 261 మంది ఉన్న పీ305 పడవ మునిగిపోగా వారిలో 186 మందిని రక్షించగలిగారు. ఇప్పటివరకూ ఈ పడవకు సంబంధించి 66 మంది మరణించారు.

(చదవండి: SC Committee: ఈ–కోర్టుల మొబైల్‌ సేవలు)    

మరిన్ని వార్తలు