పనాజీ: గోవా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ (జీఎంహెచ్సీ)లో తెల్లవారుజామున జరుగుతున్న మరణాల పరంపర కొనసాగుతోంది. కేవలం నాలుగు రోజుల్లో తెల్లవారుజాము సమయంలో 75 మంది మరణించారు. తెల్లవారు జామున 2 నుంచి 6 గంటల మధ్యలో ఈ మరణాలు సంభవించాయి. ఈ వ్యవహారంపై బాంబే హైకోర్టులోని గోవా బెంచ్ విచారణ జరుపుతోంది.
గురువారం గోవా ప్రభుత్వం తరఫున హాజరైన అడ్వకేట్ జనరల్ దేవీదాస్ పంగం.. ఆక్సిజన్ సరఫరా లోపాల వల్లే మరణాలు సంభవిస్తున్నాయని అన్నారు. ఆక్సిజన్ను తీసుకొచ్చే ట్యాంకర్ల లాజిస్టికల్ సమస్యలతో ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పారు. ఆక్సిజన్ ప్రెజర్లో లోపాల వల్ల కూడా మరణాలు సంభవిస్తున్నాయని అన్నారు. అయితే, ఆస్పత్రిలో శుక్రవారం మరో 13 మంది చనిపోయారు. ఆక్సిజన్ సంబంధిత సమస్యల కారణంగా మంగళ, బుధ, గురు, శుక్రవారాల్లో కలిపి 75 మంది ప్రాణాలు కోల్పోయారు.