సైకిల్‌పై 250 కి.మీ ప్రయాణించిన 13 ఏళ్ల బాలుడు..చివరికి ఏమైందంటే?

8 Oct, 2022 14:57 IST|Sakshi

చండీగఢ్‌: పంజాబ్‌కు చెందిన 13 ఏళ్ల బాలుడు సైకిల్‌పై ఏకంగా 250 కిలోమీటర్లు ప్రయాణం చేశాడు. పంజాబ్‌లోని పటియాలా ప్రాంతం నుంచి అతడి ప్రయాణం మొదలవ్వగా.. మూడు రోజులకు ఢిల్లీ చేరుకున్నాడు. తనకు ఇష్టమైన యూట్యూబ్‌ స్టార్‌ను కలిసేందుకు అతని ఇంతటి సాహసానికి పూనుకున్నాడు. అయితే చివరికి బాలుడి కోరిక తీరనే లేదు. ఎంతో అభిమానం, ఆశతో కలవాలనుకున్న యూట్యూబ్‌ స్టార్‌ విదేశాలకు వెళ్లాడని తెలియడంతో తీవ్ర నిరాశకు గురయ్యాడు.

వివరాలు.. పటియాలాకు చెందిన 13ఏళ్ల బాలుడు 8వ తరగతి చదువుతున్నాడు. నిశ్చయ్‌ మల్హన్‌ అనే వ్యక్తి  నిర్వహిస్తున్న ‘ట్రిగ్గర్డ్‌ ఇన్సాన్‌’ యూట్యూబ్‌ ఛానల్‌ అంటే ఎంతో ఇష్టం. ఇతనికి యూట్యూబ్‌లో కోటిన్నరకు పైగా సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. బాలుడు కూడా అతన్ని అతను ఫాలో అవుతున్నాడు. అయితే ఆ ఛానల్‌ నిర్వాహ‌కుడు నిష్‌చాయ్ మ‌ల్హాన్‌ను క‌లవాలని బాలుడు నిర్ణయించుకున్నాడు. మ‌ల్హాన్ ఢిల్లీలోని పితంపుర ప్రాంతంలో నివ‌సిస్తున్న‌ట్లు తెలుసుకున్న విద్యార్థి తన సైకిల్‌పై అక్టోబ‌ర్ 4న ఢిల్లీకి పయనమయ్యాడు.
చదవండి: Bus Accident: ఘోర ప్రమాదం.. 11 మంది సజీవదహనం

మూడు రోజులు 250 కిలోమీట‌ర్లు సైకిల్‌పై ప్ర‌యాణించి పితంపుర అపార్ట్‌మెంట్స్‌కు చేరుకున్నాడు. అయితే మ‌ల్హాన్ అక్కడ లేడని, దుబాయ్ వెళ్లిన‌ట్లు చెప్పడంతో  అత‌ను తీవ్ర నిరాశ చెందాడు. మరోవైపు కొడుకు కనిపించకుండా పోవడంతో ఆందోళన చెందిన అతని తల్లిదండ్రులు పటియాలా పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల దర్యాప్తులో పలు ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటీజీలో బాలుడు ఢిల్లీ వెళ్లినట్లు కనిపించాడు. దీంతో ఢిల్లీ పోలీసులకు సమాచారం అందించారు. అంతేగాక సోషల్‌ మీడియాను ఉపయోగించి బాలుడి గురించి ప్రచారం చేశారు.

చివరికి యూట్యూబర్‌ అపార్ట్‌మెంట్‌ వద్ద ఉన్న సీసీటీవీ పరిశీలించగా పోలీసులు బాలుడి సైకిల్‌ను గుర్తించారు, అనంతరం అతని ఇంటికి దగ్గరలో ఉన్న పార్క్‌ వద్ద బాలుడిని కనుగొన్నారు. దీంతో పోలీసులు బాలుడి తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో వారు అతన్ని ఇంటికి తీసుకెళ్లారు. అయితే అతడు రాత్రిళ్లు ఎక్కడ బస చేశాడో ఎక్కడ విశ్రాంతి తీసుకున్నాడో స్పష్టత రాలేదు. 

ఇదిలా ఉండగా బాలుడు విషయం యూట్యూబ్‌ స్టార్‌ వరకు చేరింది. ముందుగా విద్యార్థి కనిపించకుండా పోయాడని తెలిసి ఆందోళన చెందిన మల్హాన్‌ పోలీసులు అతన్ని వెతికి పట్టుకోవాలని పోలీసులను కోరాడు. అనంతరం విద్యార్థి దొరికిన సంగతి తెలిసి..‘హమ్మయ్యా ఎట్టకేలకు బాలుడు తన ఇంటికి చేరాడు. మంచి విషయం’ అంటూ ట్వీట్‌ చేశాడు.

మరిన్ని వార్తలు